ఏపీలో విశ్వవిద్యాలయాల్లో పరిస్థితులు మారుతున్నాయి. కరోనా కారణంగా ఆగిన వివిధ రకాల విద్యావిధానాలు మళ్ళీ గాడిలోపడుతున్నాయి. విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లతో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సమావేశం నిర్వహించారు. రాజ్భవన్ లో జరిగిన సమావేశంలో పలు అంశాలపై గవర్నర్ చర్చించినట్టు తెలుస్తోంది.
యోగి వేమన, అచార్య ఎన్ జి రంగా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కాకినాడ జెఎన్ టియు, శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్లతో వేర్వేరుగా భేటీ అయ్యారు. కరోనా పరిస్ధితులు కుదుట పడుతున్న నేపధ్యంలో విశ్వవిద్యాలయాలు బోధన, పరీక్షల పై దృష్టి సారించాలని సూచించారు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. కరోనా కారణంగా గతంలో రద్దు అయిన స్నాతకోత్సవాలను వేగంగా పూర్తి చేయాలని గవర్నర్ ఆదేశించారు. వచ్చే నెలలో స్నాతకోత్సవాలను పూర్తి చేసేలా కార్యాచరణకు సిద్దం కావాలని స్పష్టం చేశారు గవర్నర్ బిబి హరిచందన్. కరోనా వల్ల విద్యాప్రమాణాలు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గవర్నర్ సూచించారు.
