ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన సింధుకు ఏపీ నగదు బహుమానం

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన సింధుకు ఏపీ నగదు బహుమానం ప్రకటించింది. ఒలింపిక్స్‌ సహా అంతర్జాతీయ, జాతీయ క్రీడల్లో ప్రతిభ చాటుకున్న రాష్ట్ర క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు అందించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేసారు. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించిందన్న సీఎం… ఈ విజయాలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. ప్రతిభ చాటుతున్న రాష్ట్ర క్రీడాకారులందరికీ కూడా ప్రభుత్వం తగిన రీతిలో ప్రోత్సహిస్తుందన్నారు సీఎం.

పీవీ సింధుకు ఇటీవలే రాష్ట్రప్రభుత్వం విశాఖపట్నంలో 2 ఎకరాల స్థలాన్ని అకాడమీ నిర్వహణకోసం కేటాయించింది. టోక్యో ఒలింపిక్స్‌ వెళ్లేముందు సింధుతోపాటు రాష్ట్రానికి చెందిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు సాత్విక్, హాకీ క్రీడాకారిణి రజనిలకు రూ.5 లక్షల చొప్పున నగదు సహాయం చేసిన ప్రభుత్వం… 2017–22 స్పోర్ట్స్‌పాలసీ ప్రకారం ఒలింపిక్స్‌లో బంగారుపతకం సాధించిన వారికి రూ.75 లక్షలు, రజత పతకం సాధించిన వారికి రూ.50 లక్షలు, కాంస్యపతకం సాధించిన వారికి రూ.30 లక్షల రూపాయలను నగదు ప్రోత్సాహకంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.