Site icon NTV Telugu

Gautam Sawang Transfer: ఏపీ డీజీపీ గా రాజేంద్రనాథ్ రెడ్డి

ఏపీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై బదిలీ వేటు పడింది. కొత్త డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇంటిలిజెన్స్ డీజీగా ఉన్నారు రాజేంద్రనాథ్ రెడ్డి. డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి ని నియమించేందుకు రంగం సిద్ధం అయింది. పీఆర్సీపై అసహనంతో ఉద్యోగులు ఇటీవల నిర్వహించిన ఛలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైన సంగతి తెలిసిందే.

లక్షలాది మంది ఉద్యోగులు విజయవాడకు చేరుకుని తమ బలాన్ని ప్రదర్శించారు. పోలీసుల వైఫల్యమే దీనికి కారణమని ప్రభుత్వం భావిస్తోంది. భారీగా తరలి వచ్చిన ఉద్యోగులను నిలువరించడంలో ప్రభుత్వం విఫలమయిందని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే డీజీపీ సవాంగ్ ను బదిలీ చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టు సమాచారం. కాసేపట్లో దీనికి సంబంధించి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ బదిలీకి సంబంధించి ఇంతవరకు అధికారులెవరూ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈరోజు ముఖ్యమంత్రి జగన్ ను చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ కలిశారు. ఈ సందర్భంగా డీజీపీ బదిలీ గురించి వీరు చర్చించినట్టు సమాచారం.

రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ

గతంలో డీజీపీగా కొనసాగుతున్న ఆర్పీ ఠాకూర్‌ను బదిలీ చేసి 2019లో గౌతమ్ సవాంగ్‌ ని డీజీపీకి నియమించింది ప్రభుత్వం. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్న సీనియర్‌ అధికారి గౌతం సవాంగ్‌ను డీజీపీగా నియమించింది. ఆర్పీ ఠాకూర్‌ను ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ శాఖకు డీజీగా బదిలీ చేసిన సంగతి తెలిసిందే.

రాజేంద్రనాథ్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో విజయవాడ పోలీస్ కమిషనర్‌ గా పనిచేశారు. అలాగే హైదరాబాద్‌ ఈస్ట్ డీసీపీగా కూడా విధులు నిర్వర్తించారు. పోలీస్ హౌసింగ్ బోర్డ్ ఎండీగా పనిచేశారు.

Exit mobile version