YS Jagan: కేంద్రానికి ఏపీ సీఎం లేఖ.. జగన్ స్పెషల్ రిక్వెస్ట్..!

Ys Jagan

Ys Jagan

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌కు లేఖ రాశారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌… రష్యా – ఉక్రెయిన్‌ పరిస్థితుల దృష్ట్యా సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌కు కొరత ఏర్పడిందని.. ఆవనూనె దిగుమతులపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. 2021-22లో దేశంలో వంటనూనెల వినియోగం 240 లక్షల మెట్రిక్‌ టన్నులు కాగా, ఇందులో 40శాతం మాత్రమే దేశీయంగా ఉత్పత్తి అయ్యింది. మిగిలిన 60శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చిందన్న సీఎం… దిగుమతి చేసుకుంటున్న వంటనూనెల్లో 95 శాతం పామాయిల్‌ను ఇండోనేషియా, మలేషియాల నుంచి, 92 శాతం సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ను ఉక్రెయిన్, రష్యాలనుంచి దిగుమతి చేసుకుంటున్నాం.. ఉక్రెయిన్, రష్యాల్లో పరిస్థితుల వల్ల ఒక్కసారిగా ప్రపంచంలో ఈ వంటనూనెలకు కొరత ఏర్పడింది.. ఈ ప్రభావం వినియోగదారుల పై పడింది.. దీని వల్ల సన్‌ఫ్లవర్‌తో పాటు, ఇతర వంట నూనెల ధరలు పెరిగాయని పేర్కొన్నారు.

Read Also: Daughter in Law Remarriage: కోవిడ్‌తో కొడుకు మృతి.. కోడలికి రెండో పెళ్లి, భారీ గిఫ్ట్‌..

రాష్ట్రంలో మూడింట రెండొంతుల మంది సన్‌ఫ్లవర్‌నే వాడుతారు.. పామాయిల్‌ను 28 శాతం మంది, వేరుశెనగ నూనెను 4.3 శాతం మంది వాడుతారు.. మార్కెట్‌లో వంటనూనెల సరఫరాకు ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంది.. విజిలెన్స్, పౌర సరఫరాలు, తూనికలు కొలతలు శాఖలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయని పేర్కొన్నారు సీఎం జగన్‌. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు కూడా తీసుకున్నాయి.. ధరలు సమీక్షకు టాస్క్‌ఫోర్స్‌ కూడా ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం ముడి ఆవ నూనెపై 38.5 శాతం, శుద్ధిచేసిన ఆవనూనెపై 45శాతం దిగుమతి సుంకం ఉంది.. దిగుమతి చేసుకునేందుకు ఈ సుంకాలు ప్రతిబంధకంగా ఉన్నాయని.. కనీసం ఏడాది పాటు ఆవనూనె దిగుమతి పై సుంకాలను తగ్గించాలని లేఖలో కేంద్ర మంత్రులను కోరారు సీఎం వైఎస్‌ జగన్‌.