అమరావతిలో సహజ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై నీతి ఆయోగ్ ప్రశంసలు కురిపించింది. ప్రకృతి వ్యవసాయం కోసం ఏపీ సీఎం ఇప్పటికే అద్భుతమైన చర్యలు తీసుకున్నారని.. తాను ప్రత్యక్షంగా ఆర్బీకేలను పరిశీలించానని.. ఆర్బీకేలు అందిస్తున్న సేవలు నిజంగా అభినందనీయమంటూ నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ వెల్లడించారు.
మరోవైపు ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ… వినూత్న వ్యవసాయ పద్ధతులపై నీతిఆయోగ్ సదస్సు నిర్వహించడం ప్రశంసనీయమని వ్యాఖ్యానించారు. మన సమాజం ఆరోగ్యంగా ఉంచడానికి నాణ్యమైన ఆహార ఉత్పత్తులను సాధించాలన్నారు. రైతులు పురుగుల మందులు, రసాయన ఎరువులను వాడకుండా సేంద్రీయ విధానాల వైపునకు వెళ్లాలని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే రాష్ట్రంలో 6.30 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారని జగన్ వెల్లడించారు. రాష్ట్రంలో 2.9 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయాన్ని సాగు చేస్తున్నారని తెలిపారు. 10,778 రైతు భరోసా కేంద్రాల్లో 3009 చోట్ల ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని.. రసాయన వ్యవసాయం నుంచి సేంద్రీయ వ్యవసాయం వైపునకు తమ ప్రయాణాన్ని మరింత వేగవంతం చేస్తామని జగన్ పేర్కొన్నారు.
ఆర్బీకేల ద్వారా రైతుల ముంగిటకే అన్నిరకాల సేవలు అందుతున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 10778 ఆర్బీకేలు సేవలు అందిస్తున్నాయన్నారు. ప్రకృతి వ్యవసాయానికి బలం ఇవ్వడానికి ప్రత్యేకంగా కస్టర్ హైరింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. అన్ని వ్యవసాయ కార్యకలాపాలకు వన్స్టాప్ సెంటర్గా ఆర్బీకేలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల్లో కల్తీలను పూర్తిగా నివారించడమే కాకుండా, ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన వాటిని ఆర్బీకేల ద్వారా అందిస్తున్నామన్నారు. ఈ- క్రాప్ను అత్యంత సమర్థవంతంగా అమలు చేస్తున్నామని.. అలాగే బ్యాంకింగ్ కరస్పాండెంట్ను కూడా పెట్టామని చెప్పారు.
మరోవైపు రైతుల్లో అవగాహనను పెంచడానికి పొలంబడి నిర్వహిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. రైతులు 30–50 ఏళ్లుగా రసాయన ఎరువులు, పురుగు మందులతో వ్యసాయం చేస్తున్నారని.. ప్రకృతి, వ్యవసాయ విధానాలకు జర్మనీ ప్రభుత్వం ఇండో జర్మన్ గ్లోబల్ అకాడమీ ఆన్ ఆగ్రో ఎకాలజీ రీసెర్చ్, లెర్నింగ్ (ఐసీసీఏఏఆర్ల్) ఏర్పాటుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించడానికి ముందుకు వచ్చిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఐదేళ్లలో 20 మిలియన్ యూరోలను జర్మనీ ప్రభుత్వం సమకూరుస్తుందన్నారు. ప్రకృతి వ్యవసాయం చేసే రాష్ట్రాలకు తగిన విధంగా అండగా నిలిచేలా ఆర్థిక సంఘం సిఫార్సులు చేయాలని సూచించారు. యూనివర్శిటీల్లో సహజ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై తగిన కోర్సులు ప్రవేశపెట్టాలన్నారు. ప్రకృతి వ్యవసాయంపై మరింత పరిశోధన జరగాలన్నారు, నేచరల్ వ్యవసాయం కోసం కేంద్రం 90:10 నిష్పత్తిలో నిధులు ఇవ్వాలని సీఎం జగన్ కోరారు.
Somu Veerraju: టీచర్లకు వేసవికాలంలో కాకుండా వర్షాకాలంలో సెలవులు ఇస్తారా?