AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!

  • రాయలసీమను తాకిన నైరుతి రుతుపవనాలు
  • కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచనలు
  • 58 మండలాల్లో తీవ్ర వడగాల్పుల హెచ్చరిక
  • 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు
Rainalert

Rainalert

AP Weather Update : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల రాక మొదలైంది. రాయలసీమలోని కొన్ని ప్రాంతాలను రుతుపవనాలు తాకినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. రానున్న రెండు మూడు రోజుల్లో ఇవి రాష్ట్రమంతటా మరింత విస్తరించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఆయన తెలిపారు.

రుతుపవనాల గమనం – వర్షపాత అంచనా

ఈ ఏడాది రుతుపవనాల సీజన్‌లో కురిసే మొత్తం వర్షపాతాన్ని పరిశీలిస్తే, ఇది సాధారణ సంఖ్య కంటే కొంత తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. అయితే, స్థానిక వాతావరణ మార్పుల వల్ల కురిసే వర్షాలు ఈ లోటును కొంత మేరకు భర్తీ చేస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈసారి రుతుపవనాల గమనంలో తరచూ విరామాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. దీనివల్ల కొన్ని రోజుల పాటు వర్షాలు కురిసి, మరికొన్ని రోజుల పాటు పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. రైతులు ఈ వాతావరణ మార్పులను గమనించి, తదనుగుణంగా తమ పంట ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచించారు.

×
×
Ad

జిల్లాల వారీగా వర్షపాత సూచనలు

జూన్ నుండి సెప్టెంబర్ వరకు నైరుతి రుతుపవనాల సీజన్‌లో జిల్లాల వారీగా వర్షపాతం ఎలా ఉండబోతుందో విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది. పోలవరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, కర్నూలు, నంద్యాల, మార్కాపురం, అనంతపురము, వైఎస్‌ఆర్ కడప, నెల్లూరు, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో సాధారణ వర్షపాతం కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

రానున్న రెండు రోజుల వాతావరణ హెచ్చరికలు

రాష్ట్రంలో రేపు, ఎల్లుండి పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పాటు కొన్నిచోట్ల ఎండ ప్రభావం కూడా కొనసాగుతుంది. ఆదివారం నాడు పల్నాడు, మార్కాపురం, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయి. అలాగే సోమవారం నాడు కూడా కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

తీవ్రమైన వడగాల్పుల హెచ్చరిక

ఒకవైపు వర్ష సూచన ఉన్నప్పటికీ, మరోవైపు ఎండల తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంది. రేపు శ్రీకాకుళం జిల్లాలో 12 మండలాలు, విజయనగరంలో 22, మన్యంలో 12, అల్లూరిలో 1, పోలవరంలో 2, విశాఖపట్నంలో 1, కాకినాడలో 8 మండలాలతో కలిపి మొత్తం 58 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే ప్రమాదం ఉంది. అలాగే మరో 104 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపనుంది.

ఉష్ణోగ్రతల విషయానికి వస్తే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42 నుండి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చు. అలాగే అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 నుండి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శనివారం నాడు కృష్ణా జిల్లా పెదపారుపూడి, మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, మరికొన్ని జిల్లాల్లో 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.