కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోట్ విడుదల చేసింది. దీనితో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఈ నెల 8వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 11వ తేదీ వరకు పరిశీలన ప్రక్రియ పూర్తవుతుంది. ఈ నెల 30న ఎన్నిక, నవంబర్ రెండున కౌంటింగ్ ఉంటుంది. ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కావటంతో ఈసీ… రాజకీయ పార్టీలతో సమావేశాన్ని నిర్వహించింది. కోవిడ్ ప్రోటోకాల్స్ ప్రకారం అన్ని రకాల ర్యాలీలను ఈసీ నిషేధించింది. నామినేషన్ దాఖలుకు అభ్యర్థితో పాటు ఇద్దరు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఇంటిటి ప్రచారానికి ఐదుగురికి మించి వెళ్లకూడదని స్పష్టం చేశారు రాష్ట్ర సీఈవో విజయానంద్.
ఇక, బద్వేల్ ఉప ఎన్నిక కోసం 272 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇందులో 30 పోలింగ్ కేంద్రాలు సున్నితమైనవిగా గుర్తించారు. 50శాతం పోలింగ్ స్టేషన్లలో సీసీ కెమెరాల పర్యవేక్షణ.. లైవ్ వెబ్ స్ట్రీమింగ్ జరుగుతుంది. ఈసారి సెలైన్స్ సమయాన్ని ఈసీ 48 గంటల నుంచి 72 గంటలకు పెంచింది. అంటే ఎన్నిక జరగటానికి 72 గంటల ముందే ప్రచారాన్ని అభ్యర్ధులు ఆపివేయాల్సి ఉంటుంది. అక్టోబర్ 27 సాయంత్రం 5 గంటలతో ప్రచారానికి తెర పడుతుంది. ఈ క్యాటగిరిలో ఉన్నవాళ్లు, పోస్టల్ బ్యాలెట్ కావాలనుకుంటే పోలింగ్ కు ఐదు రోజుల ముందు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలా దరఖాస్తు చేసుకున్నవారి ఇంటికి, పోలింగ్ సిబ్బంది బ్యాలెట్ తీసుకుని వెళ్లి ఓటు వేసే విధంగా చర్యలు తీసుకుంటారు. మరోవైపు. విపక్షాల నుంచి అనుమానాలు వ్యక్తం అవుతుండడంతో … గ్రామ, వార్డు వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియలో ఉపయోగించకూడదని స్పష్టం చేశారు. ఎన్నికల వ్యయాన్ని నిశితంగా పరిశీలిస్తామన్నారు.