Site icon NTV Telugu

Jagananna Thodu: 3.95 లక్షల మందికి లబ్ధి.. ఖాతాల్లో సొమ్ము జమ..

Jagananna Thodu

Jagananna Thodu

‘జగనన్న తోడు’ పథకం కింద వడ్డీ లేని రుణాలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమచేశారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. 3.95 లక్షల మందికి ఈ పథకం ద్వారా కొత్తగా రూ.395 కోట్ల వడ్డీ లేని రుణాలను సమకూర్చడంతోపాటు గత ఆర్నెల్లకు సంబంధించి రూ.15.96 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ను కూడా జమ చేశారు.. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. చిరు వ్యాపారులకు, హస్త కళాకారులకు రూ. 10వేల చొప్పున వడ్డీలేని రుణాల పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. వరుసగా ఐదోసారి ఈ పథకం కింద డబ్బులు అందజేశాం.. కొత్తగా సుమారు 4 లక్షల మందికి రుణాలు ఇచ్చామని.. రూ. 395 కోట్ల వడ్డీలేని రుణాలతో పాటు.. గత ఆరునెలలకు సంబంధించి సకాలంలో రుణాలు చెల్లించిన వారికి రూ.15.96 కోట్ల వడ్డీని కూడా జమ చేశాం.. ఇప్పటి వరకూ ఈ పథకం కింద 15,03,558 లక్షల మందికి రూ.2,011 కోట్ల వడ్డీలేని రుణాలు అందాయని.. రుణాలు చెల్లించిన 12.50 లక్షల లబ్ధిదారులకు ప్రభుత్వం తిరిగి చెల్లించిన వడ్డీ రూ. 48.48 కోట్లుగా ఉందని తెలిపారు.

Read Also: Atchutapuram Gas Leak: గ్యాస్‌ లీక్‌ ఘటనపై సర్కార్‌ సీరియస్‌.. కంపెనీ మూసివేతకు ఆదేశాలు

స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ వారికి అండగా నిలుస్తున్నామని తెలిపారు సీఎం వైఎస్‌ జగన్.. తమకు తాము ఉపాధిని ఇవ్వడమే కాకుండా మరి కొంత మందికి ఏదో రూపంలో ఉపాధిని ఇస్తున్నారు.. వీరు చేసేది వ్యాపారం అనే కన్నా.. గొప్ప సేవ అనడంలో ఏమాత్రం సంకోచించాల్సిన అవసరంలేదన్నారు. ఇలాంటి చిరు వ్యాపారులతోపాటు సంప్రదాయ చేతివృత్తులవారికీ ఇస్తున్నాం, వడ్డీ వ్యాపారుల మీద ఆధారపడకుండా, అధిక వడ్డీల భారాన్ని మోసే అవసరం లేకుండా వీరికి తోడుగా నిలుస్తున్నామని తెలిపారు. వేయి రూపాయలకు రూ.100లు రోజు వడ్డీగా కట్టాల్సిన పరిస్థితులు గురించి నాకు పాదయాత్రలో చెప్పారు.. నడ్డి విరిచే వడ్డీల భారాన్ని తప్పించి వీరికి అండగా నిలవడానికి ఈ పథకాన్ని వర్తింపు చేస్తున్నామని.. దేశ వ్యాప్తంగా 34 లక్షలమంది వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకులద్వారా తోడ్పాటు పొందితే.. అందులో దాదాపు సగంమందికి మన రాష్ట్రంలోనే రుణాలు పొందుతున్నారని.. దీనికి సహకరించిన ప్రతి బ్యాంకుకూ మనస్ఫూర్తిగా కృజ్ఞతలు చెబుతున్నట్టు వెల్లడించారు సీఎం జగన్.

సకాలంలో చెల్లించి రెండోసారి కూడా రుణం తీసుకున్నవారు 5.08 లక్షలమంది ఉన్నారని.. వీరిందరి వడ్డీ భారాన్ని ప్రభుత్వంమే భరించిందని.. ప్రతి ఆరు నెలలకు ఒకసారి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి వడ్డీని జమ చేస్తున్నాం.. రుణం తీరిన తర్వాత తిరిగి రుణం పొందడానికి అర్హులవుతారని పేర్కొన్నారు.. ఒకసారి రుణాన్ని సకాలంలో చెల్లించి మళ్లీ తిరిగి రుణం పొందడానికి అర్హులు, ఇలా రుణం పొందేటప్పుడు రుణం మొత్తాన్ని ప్రతి విడతకూ రూ.వేయి చొప్పున పెంచేదిశగా బ్యాంకులతో మాట్లాడుతున్నాను.. సకాలంలో రుణాలు చెల్లించినవారికి రూ.48.48 కోట్లు వడ్డీలకింద ప్రభుత్వమే చెల్లించింది, గత ఆరునెలలకు సంబంధించిన రూ.15.96 కోట్ల వడ్డీని బటన్‌ నొక్కి రీయింబర్స్‌ చేస్తున్నాం అన్నారు. నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తున్నాం, జగనన్న తోడు ద్వారా లబ్ధి పొందినవారిలో 80శాతం మంది అక్క చెల్లెమ్మలే ఉన్నారు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్క చెల్లెమ్మలే మరో 80శాతం మంది ఉన్నారు, ఇది మహిళా సాధికారితకు, సామాజిక న్యాయానికి కూడా నిదర్శనం అని.. గత ప్రభుత్వంలో ఇలాంటి కార్యక్రమాలు జరగలేదు, చిరువ్యాపారులకు తోడుగా నిలవాలన్న ఆలోచన ఏరోజూ కూడా గత ప్రభుత్వంలో చేయలేదని దుయ్యబట్టారు.

గత ప్రభుత్వపాలకులకు మనసు అనేది లేదు కాబట్టి.. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ చేయలేదన్న సీఎం జగన్.. వారిది పెత్తందారీ మనస్తత్వం, వారు బాగుంటే చాలు… దుష్ట చతుష్టయానికి మంచి జరిగితే చాలు.. దోచుకో.. పంచుకో.. తినుకో.. పద్థతి వారిది అంటూ మండిపడ్డారు. ఇప్పుడు మనం డీబీటీ అమలు చేస్తున్నాం, లంచాలకు ఆస్కారం లేకుండా ప్రత్యక్ష నగదు బదిలీ చేస్తున్నాం, నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే జమ చేస్తున్నాం, ప్రతి కుటుంబానికీ కనీసం 3–4 పథకాలు అందుతున్నాయని తెలిపారు సీఎం జగన్.. అప్పుడూ అదే బడ్జెట్‌.. ఇప్పుడూ అదే బడ్జెట్‌… కానీ ఈ పథకాలు గత ప్రభుత్వంలో ఎందుకు లేవు? అని నిలదీశారు సీఎం జగన్.. అప్పుల్లో చూసినా.. గత ప్రభుత్వంతో పోలిస్తే.. సీఏజీ ప్రకారం అప్పులు తక్కువేనని వెల్లడించారు.. ఇప్పుడు పథకాలు ఎందుకు అందుతున్నాయంటే.. ఎక్కడా లంచాలు లేవు, వివక్షలేదు, అవినీతి లేదని పేర్కొన్నారు సీఎం వైఎస్‌ జగన్.

Exit mobile version