ఈనెల 3న జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ఇటీవల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో చనిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి పెద్దకర్మ దృష్ట్యా ఎల్లుండి జరగాల్సిన కేబినెట్ సమావేశాన్ని మార్చి 7వ తేదీకి ప్రభుత్వం వాయిదా వేసింది. మార్చి 7న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా.. ఆ రోజు గవర్నర్ ప్రసంగం అనంతరం కేబినెట్ సమావేశం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది.
కాగా అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. ఇప్పటికే రాష్ట్ర బడ్జెట్పై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసింది. అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేలా రాష్ట్ర బడ్జెట్ ఉంటుందని తెలుస్తోంది. మార్చి 11 లేదా 14 తేదీల్లో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణతో పాటు మరికొన్ని కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. దాదాపు రూ.2.30 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ఉండే అవకాశముంది.
