టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనతో ఒక్కసారిగా ఏపీలో రాజకీయాలు భగ్గమన్నాయి. ఈ ఘటనపై నిరసనగా టీడీపీ అధినేత చంద్రబాబు 36గంటల దీక్ష కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు రాష్ట్ర పరిణామాలను వివరించేందుకు ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఢిల్లీకి వెళ్లిన ఆయన సోమవారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కలిసి ఏపీలో జరుగుతున్న పరిస్థితులను వివరించారు. టీడీపీ కార్యాలయంపై దాడితో పాటు రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ విషయంపై కూడా రాష్ట్రపతికి వెల్లడించారు. అనంతరం మంగళవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు చేశారు.
కానీ.. కశ్మీర్ పర్యటనలో ఉన్న అమిత్షా నిన్న ఢిల్లీకి చేరుకున్నారు. వెనువెంటనే కౌన్సిల్ మీటింగ్ నిర్వహించడంతో.. ఆ మీటింగ్ లో పాల్గొన్నారు. దీంతో అమిత్షాను చంద్రబాబు కలవలేకపోయారు. చంద్రబాబు కలిసేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిన అమిత్ షా ఈ రోజు స్వయంగా చంద్రబాబుకు ఫోన్ చేశారు. ఈ క్రమంలో చంద్రబాబు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను అమిత్ షాకు వివరించారు. అంతేకాకుండా ఏపీలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం నడుస్తోందని అమిత్ షాకు తెలిపినట్లు సమాచారం.