Konaseema Fishermen: 23 రోజుల తర్వాత శుభవార్త.. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం

Konaseema Fishermen

Konaseema Fishermen

Konaseema Fishermen: అంబేద్కర్ కోనసీమ జిల్లా సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన అల్లవరం మండలం ఓడలరేవుకు చెందిన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ ఎట్టకేలకు లభించింది. వీరంతా సురక్షితంగా ఉన్నట్లు సమాచారం అందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. ఒడిశా రాష్ట్రంలోని పరదీప్ తీరానికి మత్స్యకారులు చేరుకున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఓడలరేవు నుంచి బోటులో సముద్రంలో వేటకు వెళ్లిన అనంతరం మత్స్యకారులతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మత్స్యకారుల ఆచూకీ కోసం గత 23 రోజులుగా కోస్ట్ గార్డ్, నేవీ, మత్స్యశాఖ అధికారులు సమన్వయంతో సముద్రంలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలో ఏడుగురు మత్స్యకారులు క్షేమంగా ఉన్నారన్న సమాచారం రావడంతో వారి కుటుంబాల్లో ఆనందం నెలకొంది. ఇన్నాళ్లుగా ఆందోళనతో ఎదురుచూస్తున్న బంధువులు ఈ వార్తతో ఊపిరి పీల్చుకున్నారు. మత్స్యకారులు ప్రస్తుతం పరదీప్ తీరంలో ఉన్నట్లు సమాచారం. మత్స్యకారులు పరదీప్ తీరానికి ఎలా చేరుకున్నారు? బోటు పరిస్థితి ఏమిటి? ఇంతకాలం వారితో ఎందుకు సంబంధాలు లేకుండా పోయాయి? అనే అంశాలపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. అలాగే మత్స్యకారుల ఆరోగ్య పరిస్థితిపై కూడా ఆరా తీస్తున్నారు. మత్స్యకారులను సురక్షితంగా వారి స్వస్థలాలకు తీసుకువచ్చేందుకు అధికారులు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. కోస్ట్ గార్డ్, నేవీ, మత్స్యశాఖ అధికారుల సమన్వయంతో సేకరించిన సమాచారాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. 23 రోజులుగా కొనసాగిన గాలింపు చర్యలకు ఎట్టకేలకు ఫలితం దక్కడంతో మత్స్యకారుల కుటుంబాల్లో ఆందోళన తొలగింది. తమవారు క్షేమంగా తిరిగి స్వస్థలానికి చేరుకోవాలని కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు.