Aqua Farmers Crop Holiday: సమస్యలు పరిష్కరించకపోతే క్రాప్ హాలిడే.. ఆక్వా రైతుల డెడ్‌లైన్

Aqua Farmers Crop Holiday

Aqua Farmers Crop Holiday

Aqua Farmers Crop Holiday: ఆక్వా రైతులు పోరాటం తీవ్రం చేస్తున్నారు.. తమ సమస్యలు పరిష్కరించకపోతే క్రాప్‌ హాలిడే ప్రకటిస్తామని హెచ్చరించారు.. ఈ మేరకు ప్రభుత్వానికి డెడ్‌లైన్‌ పెట్టారు ఆక్వా రైతులు.. ఆక్వా రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించకపోతే క్రాప్ హాలిడేకు వెళ్లాలని ఆక్వా రైతుల రాష్ట్ర సదస్సు కీలక తీర్మానం చేసింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సదస్సులో రైతులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు క్రాప్ హాలిడే ప్రకటించాలని తీర్మానించారు. ఈ నెల 30వ తేదీలోపు రొయ్యల ఫీడ్ ధరలను తగ్గించాలని, రొయ్యల సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపాలని సదస్సు డిమాండ్ చేసింది. అక్టోబర్ 1 నుంచి హేచరీలు, ఫీడ్, మెడిసిన్ కొనుగోళ్లను నిలిపివేయాలని నిర్ణయించింది. హైకోర్టు తీర్పు మేరకు జూన్ వరకు అమల్లో ఉన్న పాత ధరలకే ఫీడ్ విక్రయించాలనే నిర్ణయంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు.

ఆక్వా రైతుల సమస్యల పరిష్కారం కోసం అమలాపురంలో భారీ స్థాయిలో ‘ఆక్వా రైతు బ్రతుకు పోరాటం’ పేరుతో మహాసభ నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వేలాది మంది రైతులు తరలివచ్చారు. పేరూరు వై జంక్షన్ నుంచి అమలాపురం క్షత్రియ కళ్యాణ మండపం వరకు భారీ ర్యాలీ చేపట్టి పెరిగిన సీడ్, ఫీడ్ ధరలను వెంటనే తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్పత్తి వ్యయాలు భారీగా పెరగడంతో సాగు చేసినా నష్టాలు వస్తున్నాయని తెలిపారు. రొయ్యలకు గిట్టుబాటు ధర లభించకపోవడం, ఫీడ్ ధరల పెరుగుదల, ఇతర సాగు సమస్యలు రైతులపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతున్నాయని పేర్కొన్నారు. ఫీడ్ ధరలపై రైతుల ఆందోళనకు సంబంధించి గతంలో ప్రభుత్వం, తయారీ సంస్థల మధ్య చర్చలు కూడా జరిగాయి.

గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా ద్వారా సమస్యలు వెలుగులోకి వచ్చిన వెంటనే స్పందించేవారని రైతులు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం వేలాది మంది రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆక్వా రైతుల సమస్యల అధ్యయనం కోసం ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ, ఆ కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయడం లేదని రైతులు ఆరోపించారు. సీడ్, ఫీడ్ ధరలను నియంత్రించడంతో పాటు ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని మహాసభ వేదికగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆక్వా రంగంలో నాణ్యమైన సీడ్ సరఫరా, ట్రేసబిలిటీ లేని హేచరీలపై చర్యలు, విద్యుత్ రాయితీ పెంపు, నీటి మోటార్ల విద్యుత్ వినియోగంపై సడలింపులు, రొయ్యల కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం జోక్యం వంటి అంశాలు కూడా రైతుల ప్రధాన డిమాండ్లలో ఉన్నాయి. ఆక్వా సెస్ ద్వారా వచ్చే నిధులు రైతుల సంక్షేమానికే వినియోగించాలని, NFDB ద్వారా సబ్సిడీలు అందించాలని రైతులు కోరుతున్నారు. వైరస్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. రైతుల భారీ రాకతో అమలాపురంలో సందడి నెలకొంది. సమస్యలు పరిష్కరించకపోతే క్రాప్ హాలిడేకు వెళ్లే నిర్ణయం నేపథ్యంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్రంలో ఆక్వా రైతులు ఫీడ్ ధరలు, మార్కెట్ ధరల తగ్గుదల వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు.