AP High Court: విశాఖ డేటా సెంటర్‌పై హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు

Ap High Court Recruitment 2

Ap High Court Recruitment 2

AP High Court: విశాఖ డేటా సెంటర్ పార్క్ ఏర్పాటు వ్యవహారంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. డేటా సెంటర్‌కు సంబంధించిన నిర్మాణ పనులు చట్ట నిబంధనలు, పర్యావరణ అనుమతులకు లోబడి మాత్రమే చేపట్టాలని స్పష్టం చేసింది. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులదేనని తేల్చిచెప్పింది. కోర్టుకు ఇచ్చిన హామీని ఉల్లంఘిస్తే సంబంధిత అధికారులను బాధ్యులను చేస్తామని హెచ్చరించింది. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి చెందిన 160 ఎకరాల భూములను హైపర్ స్కేల్ డేటా సెంటర్ పార్క్‌కు కేటాయిస్తున్నారంటూ పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు విచారణ జరిపింది. డేటా సెంటర్‌కు సమీపంలో అటవీ ప్రాంతం, జలాశయం ఉన్నాయని.. ప్రాజెక్ట్ వల్ల వన్యప్రాణులకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఈ ప్రాజెక్ట్ ‘ఏ’ కేటగిరీ కిందకు వస్తుందని.. కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని వాదించారు. దేవస్థాన భూములను ఎలా కేటాయించారని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. భూములను కేటాయించలేదని.. దేవస్థాన అథారిటీ 11 ఏళ్లకు లీజుకు ఇవ్వనుందని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ లీజు ద్వారా దేవస్థానానికి ఏడాదికి 26 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని తెలిపింది. డేటా సెంటర్ పనులు చట్ట నిబంధనలు, పర్యావరణ అనుమతులకు అనుగుణంగానే చేపడతామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో.. ఆ హామీని తప్పనిసరిగా అమలు చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది..