TDP: తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం అమరావతిలో ఘనంగా నిర్వహించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కొత్తగా నియమితులైన కార్యవర్గ సభ్యులు పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలకు కట్టుబడి పనిచేస్తామని ప్రమాణం చేశారు. కార్యక్రమంలో ముందుగా నూతన కార్యవర్గ సభ్యులతో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయించారు. ఆత్మసాక్షిగా పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేయాలని ఆయన సూచించారు. సేవాభావంతో, మనసా-వాచా-కర్మణా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని సభ్యులు ప్రమాణం చేశారు.
Read Also: Nagarjuna-Lenin : ‘లెనిన్’ పై నాగార్జున సాలిడ్ రివ్యూ.. రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేసిన కింగ్
టీడీపీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, పార్టీ ప్రతిష్టను మరింత పెంచడం, క్రమశిక్షణతో పనిచేయడం తమ బాధ్యతగా స్వీకరిస్తున్నామని కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు. ప్రజలు పార్టీపై ఉంచిన విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయబోమని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, పార్టీకి ఉజ్వల భవిష్యత్తు తీసుకురావడంలో ప్రతి నాయకుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజాసేవే పార్టీ ప్రధాన ధ్యేయమని, అందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. టీడీపీ నూతన కార్యవర్గం బాధ్యతలు స్వీకరించడంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. రానున్న రోజుల్లో పార్టీ మరింత బలోపేతం దిశగా ముందుకు సాగుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
