TTD Laddu Controversy: సంచలనం సృష్టించిన టీటీడీ లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. టీటీడీ లడ్డూ వ్యవహారంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి లడ్డూల్లో జంతువుల కొవ్వు లేదా రసాయనాలు కలిసినట్టు ఆరోపణలు చేయడం పై దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు. లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పడానికి మీరు నిపుణులా? అని పిటిషనర్ను ప్రశ్నించారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై Central Bureau of Investigation (సీబీఐ) దర్యాప్తు కొనసాగుతోందని చీఫ్ జస్టిస్ తెలిపారు. పిటిషనర్ వద్ద ఏవైనా ఆధారాలు ఉంటే వాటిని సీబీఐకి అందించాలని సూచించారు.
పిటిషన్ వివరాలు
ఈ కేసులో తిరుపతి లడ్డూల్లో జంతువుల కొవ్వు లేదా రసాయనాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుండటాన్ని ఆపాలని కోరుతూ మానూరు శ్రీనివాస్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కూడా పిటిషన్లో కోరారు. అయితే ఈ అంశంపై ఇప్పటికే విచారణ జరుగుతోందని పేర్కొంటూ సుప్రీంకోర్టు పిటిషన్ను డిస్మిస్ చేసింది.
