Nara Lokesh: మంత్రి లోకేష్‌తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం

Nara Lokesh

Nara Lokesh

Nara Lokesh: ప్రవచన చక్రవర్తి, నైతిక విలువల సలహాదారులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఉండవల్లిలో రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ సందర్భంగా సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దడానికి నైతిక విలువలతో కూడిన విద్య ఎంతటి కీలకమైనదో చాగంటి కోటేశ్వరరావు మంత్రికి వివరించారు. చిన్ననాటి నుంచే పిల్లలలో మానవీయ విలువలు, క్రమశిక్షణ, నైతికతను పెంపొందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు చాగంటి కోటేశ్వరరావు దిశా నిర్దేశంలో రూపకల్పన చేసిన నైతిక విలువల పాఠ్యాంశాలను నో బ్యాగ్ డే రోజు బోధిస్తున్నారు. నైతిక విలువల విద్యతోనే సమగ్ర విద్యా వికాసం సాధ్యమని నమ్మిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగం కావడం పట్ల చాగంటి కోటేశ్వరావు సంతోషం వ్యక్తం చేశారు. భేటీ అనంతరం ఇంటి నుంచి కారు వద్దకు వచ్చి చాగంటి కోటేశ్వరావుని వినయపూర్వకంగా సాగనంపారు మంత్రి నారా లోకేష్.