Minister Narayana: రాష్ట్రంలోని 8 మున్సిపల్ కార్పొరేషన్ లకు కొత్తగా నియమించబడిన కమిషనర్లతో సమీక్ష నిర్వహించారు మంత్రి నారాయణ.. సచివాలయంలో జరిగిన ఈ సమీక్ష సమావేశానికి మున్సిపల్ శాఖ డైరెక్టర్ హరీనారాయణన్, టిడ్కో ఎండీ సాయి కాంత్ వర్మ, స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఎండీ గంధం చంద్రుడు హాజరయ్యారు.. ఆయా కార్పొరేషన్లలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, టిడ్కో ఇళ్లపై చర్చించారు.. ఈ సందర్భంగా మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ.. నగరాల్లో పార్కులు, సెంట్రల్ డివైడర్లు, రోడ్ల గుంతలు పూడ్చడం, డ్రెయిన్లలో పూడిక తొలగింపుపై దృష్టి పెట్టాలని ఆదేశించారు..
Read Also: Cabinet Sub Committee: 317 జీవోపై కేబినెట్ సబ్కమిటీ భేటీ.. విచారణ చేసి నివేదిక అందజేయాలని నిర్ణయం
ఇక, రోడ్లపై సెంట్రల్ డివైడర్ లలో ఎలాంటి ఫ్లెక్సీలు ఉన్నా వెంటనే తొలగించాలని సూచించారు మంత్రి నారాయణ.. సెంట్రల్ డివైడర్లలో ఫ్లెక్సీలు ఉండటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్న ఆయన.. వ్యాధులు ప్రబలకుండా ఎప్పటికప్పుడు తాగునీటి పరీక్షలు చేయాలన్నారు.. అన్న క్యాంటీన్లు నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి.. వీధి కుక్కలకు సంతాన నియంత్రణ ఆపరేషన్లు (స్టేరిలైజేషన్) చేయించాలన్నారు.. టౌన్ ప్లానింగ్ పై ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా చూడాలి.. టిడ్కో ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తి చేసేలా చూడాలంటూ కీలక ఆదేశాలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ.