NTV Telugu Site icon

Nara Lokesh Praja Darbar: 41వ రోజు మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్.. అండగా ఉంటానని హామీ

Lokesh

Lokesh

Nara Lokesh Praja Darbar: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. తన నియోజకవర్గం మంగళగిరి ప్రజల కోసం.. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వివిధ సమస్యలపై తరలివస్తున్న ప్రజల కోసం ప్రజాదర్బార్‌ నిర్వహిస్తున్నారు మంత్రి నారా లోకేష్‌.. ఇక, ప్రజా దర్బార్ సిబ్బంది తో ప్రతి 15 రోజులకొకసారి ప్రత్యేకంగా భేటీ అవుతున్న లోకేష్.. వివిధ శాఖల వారీగా వచ్చిన సమస్యలు, ఎన్ని పరిష్కారం చేయగలిగాం అని స్వయంగా వివరాలు తెలుసుకుంటున్నారు.. స్వయంగా తానే మంత్రులతో మాట్లాడుతూ సంబంధిత శాఖల సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని కోరుతున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ సమస్యలతో బాధపడుతున్న ప్రజలు ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న “ప్రజాదర్బార్” కు తరలివచ్చారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి నారా లోకేష్ ను కలిసి విన్నపాలు అందజేశారు. 41వ రోజు “ప్రజదర్బార్” లో ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి.. సమస్యలను సంబంధిత శాఖలకు పంపి పరిష్కరానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు.

ఇక, మంత్రి దృష్టికి వచ్చిన సమస్యలు..
* అనారోగ్యంతో బాధపడుతున్న తనకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని ఉండవల్లికి చెందిన కె.మంగ విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
* ఇంజనీరింగ్ చదివిన తాను నిరుద్యోగిగా ఉన్నానని, వివాహమై, ఇద్దరు పిల్లలు ఉన్న తనకు కుటుంబ పోషణ భారంగా మారిందని, విజయ డైయిరీలో ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన కె.రాణి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
* తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన భర్తకు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని తాడేపల్లి సుందరయ్య నగర్ కు చెందిన నాగేశ్వరమ్మ విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
* కుటుంబ పోషణ కోసం మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో హౌస్ కీపింగ్ ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని నవులూరుకు చెందిన ఎలిజాల వెంకటరమణ విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
* అనారోగ్యంతో భర్త, రోడ్డు ప్రమాదంలో కుమారుడిని కోల్పోయి ఏకాకిగా మారిన తనను ఉన్న కోడలు ఆదరించడం లేదని, కుమారుడి మృతితో ప్రభుత్వం, బీమా ద్వారా అందిన రూ.65 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం అనుభవిస్తూ కోడలు దుర్గాభవాని తనకు అన్యాయం చేసిందని పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన వడ్డెంగుంట శేషవాణి మంత్రి నారా లోకేష్ ను కలిసి కన్నీటిపర్యంతమయ్యారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
* తీవ్ర అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న తమ కుమారుడి వైద్యానికి ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పురుషోత్తమపట్నానికి చెందిన గాదె గోపాలకృష్ణ మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు.
* అధిక వడ్డీ వసూలుతో తీవ్రంగా నష్టపోయాయని, విచారించి తగిన న్యాయం చేయాలని విజయవాడకు చెందిన జక్క వీరస్వామి విజ్ఞప్తి చేశారు. స్థానికంగా ఉండే జాస్తి రమణి వద్ద నాలుగేళ్ల క్రితం రూ.2 లక్షల వరకు అప్పుచేశానని, అయితే రూ.10 వడ్డీ అంటూ బెదిరించి ఇప్పటివరకు తనవద్ద నుంచి రూ.7.50 లక్షలు వసూలు చేశారని, మరో రూ.4 లక్షలు చెల్లించాలంటూ వేధిస్తున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. పరిశీలించి తగిన న్యాయం చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.
* దివ్యాంగురాలినైన తనకు ఎలాంటి ఆధారం లేదని, పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని కృష్ణా జిల్లా కోడూరు మండలం ఉల్లిపాలెంకు చెందిన జి.సుగుణ విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
* గత 9 దశాబ్దాలుగా గ్రామంలో కొనసాగుతున్న ప్రభుత్వ పాఠశాలను గత ప్రభుత్వం మూసివేసిందని, దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, తిరిగి పునరుద్దరించాలని ప్రకాశం జిల్లా పర్చూరు మండలం తూర్పు పెద్దివారిపాలెం, యద్దనపూడి మండలం పడమర పెద్దివారిపాలెం గ్రామస్థులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు.
* ఇంజనీరింగ్ చదివిన తనకు శ్రీ సిమెంట్స్ కంపెనీలో శాశ్వత ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువుకు చెందిన నల్లమేకల అశోక చక్రవర్తి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.