Minister Nara Lokesh: ఎవర్‌వోల్ట్ గ్రీన్ ఎనర్జీ చైర్మన్‌తో మంత్రి లోకేష్‌ భేటీ.. ఏపీలో సోలార్ సెల్ యూనిట్ పెట్టండి..!

  • ఎవర్ వోల్ట్ చైర్మన్ సైమన్ టాన్‌తో మంత్రి లోకేష్ భేటీ..
  • ఏపీలో సోలార్ సెల్ యూనిట్ ఏర్పాటు చేయాలని ఆహ్వానం..
  • ఐటీఐలో రెన్యువబుల్ ఎనర్జీ నైపుణ్యశిక్షణకు అంగీకారం..
Lokesh

Lokesh

Minister Nara Lokesh: సింగపూర్‌ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ బిజీబిజీగా గడుపుతున్నారు.. ఓవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో కలిసి వివిధ సమావేశాల్లో పాల్గొంటున్న ఆయన.. మరోవైపు.. వివిధ సంస్థల చీఫ్‌లు, ప్రతినిధులతో భేటీ అవుతున్నారు.. ఎవర్‌వోల్ట్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ సైమన్ టాన్ తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమావేశం అయ్యారు. 2029నాటికి ఆంధ్రప్రదేశ్ లో 160 గిగావాట్ల పునరుత్పాదకం ఇంధన సామర్థ్యం కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నామని. ఇందుకు అనుగుణంగా ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ – 2024ను ప్రకటించాం అన్నారు… రెన్యూ, సుజలాన్ వంటి బడా సంస్థలు ఇప్పటికే రాష్ట్రంలో తమ కార్యకలాపాలు ప్రారంభించాయని… ఆంధ్రప్రదేశ్ లో పెద్దఎత్తున సోలార్ సెల్, మాడ్యూల్, బ్యాటరీ తయారీ యూనిట్ ఏర్పాటు చేయమని కోరారు..

Read Also: Electric Scooter: డ్రైవింగ్ లైసెన్స్ లేదా? డోంట్ వర్రీ.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను నడపడానికి అవసరం లేదు.. ధర రూ. 70 వేల లోపే

ఏపీలో అధునాతన సౌరశక్తి నిల్వ ఆవిష్కరణల కోసం ఎవర్ వోల్ట్ రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు లోకేష్‌.. ఏపీలోని ఐటిఐలలో రెన్యువబుల్ ఎనర్జీ స్కిల్ డెవలప్ మెంట్ ట్రైనింగ్ కు సహకారం అందించాలని కోరారు. దీనిపై ఎవర్ వోల్ట్ చైర్మన్ సైమన్ టాన్ స్పందిస్తూ… ఏపీ ఎంపికచేసిన ఒక ఐటిఐలో రెన్యువబుల్ ఎనర్జీపై ప్రత్యేకంగా నైపుణ్య శిక్షణ ఇస్తామని తెలిపారు. బెంగుళూరు ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఎవర్ వోల్ట్ గ్రీన్ ఎనర్జీ సంస్థ.. సోలార్ సెల్స్, మాడ్యూల్స్, రూఫ్ టాప్ సొల్యూషన్స్, ఎనర్జీ స్టోరేజి ఉత్పత్తుల్లో ప్రత్యేకత కలిగి ఉందని చెప్పారు. ఈ ఏడాది మార్చినాటికి 1 గిగావాట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించిన తమ సంస్థ.. 2026నాటికి 3 గిగావాట్ల చేరుకునే లక్ష్యంతో పనిచేస్తోందని చెప్పారు. తమ సంస్థ ఉన్నతస్థాయి బృందంతో మాట్లాడి ఏపీలో యూనిట్ ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలిస్తామని సైమన్ టాన్ చెప్పారు.