Site icon NTV Telugu

Heritage Foods Legal Notice to Botsa: బొత్స సత్యనారాయణకు హెరిటేజ్‌ లీగల్‌ నోటీసులు..

Heritage Foods Legal Notice

Heritage Foods Legal Notice

Heritage Foods Legal Notice to Botsa: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు Heritage Foods లీగల్ నోటీసులు జారీ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా అసత్య, నిరాధార ఆరోపణలు చేశారంటూ హెరిటేజ్ సంస్థ తరఫున న్యాయవాది జి. మల్లిఖార్జున్ రావు నోటీసులు పంపారు. హెరిటేజ్ సంస్థ దశాబ్దాలుగా ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటిస్తూ, పారదర్శక విధానాలతో కార్యకలాపాలు నిర్వహిస్తోందని నోటీసుల్లో పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న ప్రీమియం బ్రాండ్‌గా గుర్తింపు పొందిన సంస్థపై తప్పుడు ప్రచారం చేయడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.

Read Also: Vanasthalipuram Murder: హైదరాబాద్‌లో దారుణ హత్య.. గర్భిణి అని కూడా చూడకుండా రంపం, కత్తులతో మాజీ భర్త కిరాతకం!

శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ ఇతర వైసీపీ నేతలతో కలిసి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో అసంబద్ధ వ్యాఖ్యలు చేశారని సంస్థ ఆరోపించింది. ముఖ్యంగా 2014–2019 మధ్య ఇందాపూర్ డైరీ పేరుతో టీటీడీకి నెయ్యి సరఫరా చేశారన్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని స్పష్టం చేసింది. అలాగే 22 సంస్థలతో కలిసి సిండికేట్ ఏర్పాటు చేసిందన్న వ్యాఖ్యలు కూడా వాస్తవానికి విరుద్ధమని పేర్కొంది. భారత న్యాయ సంహిత (BNS) చట్టంలోని సెక్షన్ 356 ప్రకారం పరువు నష్టం కలిగించినందుకు సమాధానం చెప్పాలని నోటీసుల్లో డిమాండ్ చేశారు. తక్షణమే చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకపోతే సివిల్ మరియు క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. బొత్స సత్యనారాయణ ఈ నోటీసులకు ఎలా స్పందిస్తారు? తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? అన్నది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version