CM Chandrababu: ప్రతి శాఖలో సంస్కరణలు.. మోడీ సహకారం, పవన్‌ తోడ్పాటుతోనే.. ఇది టీమ్‌ స్పిరిట్‌

Babu

Babu

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ ప్రారంభమైంది.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి శాఖలో సంస్కరణలు తీసుకొస్తున్నామని తెలిపారు. మద్యం పాలసీలో మార్పులు తీసుకొచ్చి అనేక సంస్కరణలు చేశామని చెప్పారు. ప్రతి నెల 9వ తేదీన ఆర్థిక నివేదికలు విడుదల చేస్తామని, వాటి ద్వారా శాఖలు, అధికారుల పనితీరును సమీక్షిస్తానని వెల్లడించారు. క్వార్టర్‌-1లో ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర వృద్ధిరేటు 13.44 శాతంగా నమోదైందని తెలిపారు. ఇక, పోలవరం ప్రాజెక్టును వచ్చే మార్చి నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చంద్రబాబు చెప్పారు. అమరావతికి వచ్చే విషయంలో సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు కీలక మార్పుగా నిలుస్తోందన్నారు. అమరావతిని హైదరాబాద్‌ కంటే మెరుగైన రూపంలో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ‘సీఈవో టు వాటర్‌మ్యాన్‌’ అనే శీర్షికతో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో వచ్చిన కథనం తనకు ఎంతో ఆనందం కలిగించిందన్నారు.

దేశంలో రోడ్డు గ్రిడ్‌ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. గోదావరి–కావేరి, అక్కడి నుంచి మహానదిని అనుసంధానం చేసి వాటర్‌ గ్రిడ్‌ ఏర్పాటు చేస్తే భారత్‌ అన్‌స్టాపబుల్‌గా మారుతుందని అన్నారు. గంగా–కావేరి నదుల అనుసంధానం కూడా జరగాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో 36 ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేస్తామని ప్రకటించారు.. పార్టీ కాన్క్లేవ్‌లో న్యూ ఎనర్జీపై అందరిలో ఉత్సాహం వచ్చిందని చంద్రబాబు చెప్పారు. ప్రధాని మోదీ సహకారం, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తోడ్పాటుతోనే ఈ కార్యక్రమాలు సాధ్యమవుతున్నాయని, ఇవి తన ఒక్కడి వల్ల జరుగుతున్నవి కావని, టీమ్‌ స్పిరిట్‌తోనే సాధిస్తున్నామని స్పష్టం చేశారు.

అర్బన్‌ ఏరియా హైదరాబాద్‌, తెలంగాణ వైపు వెళ్లిపోయిందని, వ్యవసాయం ఉన్న ప్రాంతం మాత్రం మనకు వచ్చిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గతంలో రాష్ట్రంలో డెట్‌ సస్టైనబిలిటీ కూడా లేదని నీతి ఆయోగ్‌ వంటి సంస్థలు పేర్కొన్నాయని గుర్తుచేశారు. ఇప్పుడు లాక్‌లో ఉన్న అవకాశాలను అన్‌లాక్‌ చేశామని తెలిపారు. అధికార యంత్రాంగంలో ఫైళ్లను పెండింగ్‌లో పెట్టే విధానంపై కూడా సీఎం స్పందించారు. ఒక అధికారి ఒక ఫైలును ఆరు నెలల పాటు కోల్డ్‌ స్టోరేజీలో ఉంచితే, దానికి సంబంధించిన పనులన్నీ నిలిచిపోతాయని అన్నారు. పరిపాలనలో వేగం, పనితీరు పెరగాల్సిన అవసరం ఉందని సూచించారు.

వైద్య రంగంలో సంజీవిని ప్రాజెక్టు తీసుకొచ్చామని చంద్రబాబు తెలిపారు. జె-బ్రాండ్‌ మద్యం కారణంగా రాష్ట్రంలో 30 వేల మంది చనిపోయారని ఆరోపించారు. విద్యుత్‌ రంగంలో నాణ్యమైన విద్యుత్‌ అందించడంతో పాటు టారిఫ్‌ను ఎక్కడా పెంచలేదని చెప్పారు. ప్రతి నెల 9వ తేదీన వచ్చే మంత్లీ ఎకనామిక్‌ రిపోర్టు ద్వారా అన్ని శాఖల పనితీరును పరిశీలిస్తానని సీఎం తెలిపారు. ప్రస్తుత ధరల ఆధారంగా తొలి త్రైమాసికంలో 13.44 శాతం వృద్ధిరేటు నమోదైందన్నారు. 2022–23 స్థిర ధరలను ప్రాతిపదికగా తీసుకుని కేంద్రం కొత్త వృద్ధిరేటును లెక్కిస్తోందని వివరించారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధిలో తయారీ రంగం అత్యధికంగా కాంట్రిబ్యూట్‌ చేస్తోందని, భవిష్యత్తులో మరింత అధిక వృద్ధి సాధించే అవకాశం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.