YS Jagan: హలో ఇండియా.. ఆంధ్రాలో అరటి రైతుల దుస్థితి చూడండి..!

  • హలో ఇండియా.. ఆంధ్రాలో అరటి రైతుల దుస్థితి చూడండి..
  • ఏపీలో ఒక కిలో అరటిపండ్లు కేవలం 50 పైసలకే అమ్ముడవుతున్నాయి..
  • ఈ పరిస్థితి రాష్ట్రం లోని అరటి రైతుల ఆవేదనను బయట పెడుతుంది..
  • లక్షలు ఖర్చు పెట్టి, నెలల తరబడి శ్రమించిన రైతులకు నిజంగా పెద్ద దెబ్బ..
Ys Jagan

Ys Jagan

YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో అరటి రైతుల దుస్థితిపై సోషల్ మీడియా వేదికగా మాజీ సీఎం, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. రాష్ట్రంలో అరటి రైతుల పరిస్థితిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎక్స్‌లో కీలక ట్వీట్ చేశారు. “హలో ఇండియా.. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం ఏ స్థితిలో ఉందో చూడండి” అంటూ తీవ్రస్థాయిలో ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో ఒక కిలో అరటిపండ్లు కేవలం 50 పైసలకే అమ్మబడుతున్నాయి. మాచీస్‌ బాక్స్, బిస్కెట్ ప్యాకెట్ కంటే తక్కువ ధరకు అరటి రైతులు తమ పంట అమ్మాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలు ఖర్చు పెట్టి, నెలల తరబడి శ్రమించిన రైతులు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం దిగ్భ్రాంతికరం అని అన్నారు.

Read Also: Shamirpet Police Station : శభాష్‌.. శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్.. తెలంగాణలో మొదటి స్థానం

అరటితో పాటు ఉల్లి, టమాటా వంటి పంటలకు కూడా గిట్టుబాటు ధర దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్‌ జగన్‌.. అలాగే ప్రస్తుత ప్రభుత్వం రైతులకు ఎలాంటి సహాయం అందించడంలేదని ఆరోపించారు. ఉచిత పంట బీమా లేదు.. విపత్తుల సమయంలో ఇన్‌పుట్ సబ్సిడీలు లేవు.. పంట సహాయం మాటలకే పరిమితం అంటూ విమర్శలు గుప్పించారు.. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టన్నుకు అరటి ధరను సగటున రూ.25,000 వరకు నిలబెట్టామని, అవసరమైతే రైతుల పంటను ఢిల్లీ వరకూ పంపేందుకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశామని.. అలాగే కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేసి రైతులను రక్షించాం అని గుర్తుచేశారు. యువత, రైతుల సమస్యలు పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది అని విమర్శిస్తూ.. “ఒక కిలో అరటి ధర 50 పైసలు అయితే.. ఆ రైతు చేతుల విలువ ఎంత?” అంటూ ప్రశ్నించారు వైఎస్‌ జగన్‌..