AP Weather Alert: ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. అయితే, ఈ సమయంలో ఈదురు గాలులు, పిడుగులు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి.. అయితే, దీనికి ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది.. మరోవైపు.. రాష్ట్రంలోని పలు జిల్లాలకు తాజాగా కీలక వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది విపత్తు నిర్వహణ సంస్థ.. రానున్న మూడు గంటల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ముఖ్యంగా విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన APSDMA, ఈ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా గజపతినగరం, శృంగవరపుకోట, భీమునిపట్నం పరిసర ప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. అదే సమయంలో అన్నమయ్య, శ్రీసత్యసాయి, తిరుపతి, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి చెదురుమదురు వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది.

