Minister BC Janardhan Reddy: ఆంధ్రప్రదేశ్లో రహదారుల అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయడంపై ఆర్&బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దృష్టి సారించారు. విజయవాడలోని ఆర్&బీ శాఖ ఈఎన్సీ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి, శాఖ పనుల పురోగతిని పరిశీలించారు. ఇదే సందర్భంగా “WATCH AP RISE” పేరుతో ఆర్&బీ శాఖ అధికారిక యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించారు.
ప్రజలకు అభివృద్ధి పనులపై అవగాహన
రాష్ట్రంలో జరుగుతున్న రహదారి అభివృద్ధి కార్యక్రమాలు, శాఖ అధికారులు చేస్తున్న కృషిని ప్రజలకు చేరవేసేందుకు ఈ యూట్యూబ్ ఛానల్ ఉపయోగపడుతుందని మంత్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. ఆర్&బీ శాఖ అధికారులు కష్టపడి పనిచేస్తేనే ప్రజలు రోడ్లపై సురక్షితంగా, సౌకర్యవంతంగా ప్రయాణించగలుగుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇక, రాష్ట్రంలో మొత్తం 45,433 కిలోమీటర్ల ఆర్&బీ రహదారులు ఉన్నాయని, వాటిలో 10,238 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధి అవసరం ఉందని మంత్రి వెల్లడించారు. రూ.2,500 కోట్లతో చేపట్టిన 6,061 కిలోమీటర్ల రహదారి అభివృద్ధి పనుల్లో ఇప్పటివరకు 53 శాతం మాత్రమే పూర్తయ్యాయని అధికారులు వివరించారు. అలాగే రూ.514 కోట్లతో చేపట్టిన కొన్ని పనుల్లో తీవ్ర జాప్యం నెలకొన్నందున వెనుకబడిన జిల్లాల అధికారులు వేగం పెంచాలని మంత్రి ఆదేశించారు.
బిటుమన్ కొరతతో పనుల్లో జాప్యం
పనులు ఆలస్యమవడానికి ప్రధాన కారణం బిటుమన్ సరఫరాలో కొరతేనని అధికారులు తెలిపారు. డిమాండ్కు తగినంత బిటుమన్ అందుబాటులో లేకపోవడంతో పనులు మందగించాయని వివరించారు. ఇక, కూటమి ప్రభుత్వం రెండేళ్లలో రహదారుల అభివృద్ధికి రూ.8,530 కోట్ల నిధులు మంజూరు చేసిందని మంత్రి చెప్పారు. ఇందులో ఇప్పటికే రూ.4,110 కోట్ల బిల్లులను కాంట్రాక్టర్లకు చెల్లించామని వెల్లడించారు. పెండింగ్ పనులను నెలవారీ లక్ష్యాలతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
వెనుకబడిన జిల్లాల్లో మంత్రి పర్యటన
రోడ్ల అభివృద్ధి పనుల్లో వెనుకబడిన జిల్లాలను వచ్చే నెలలో స్వయంగా సందర్శిస్తానని మంత్రి హెచ్చరించారు. అప్పటికి గణనీయమైన పురోగతి సాధించాలని అధికారులకు సూచించారు. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తరచూ దెబ్బతింటున్న 1,009 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధికి రూ.1,683 కోట్ల ప్రతిపాదనలు ప్రభుత్వ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయని తెలిపారు. అలాగే శిథిలావస్థలో ఉన్న దాదాపు 100 వంతెనల పునర్నిర్మాణానికి రూ.818 కోట్ల ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు వెల్లడించారు.
ప్రతికూల వార్తలపై బాధ్యతగా స్పందించాలి
పత్రికలు, సోషల్ మీడియాలో రహదారుల పరిస్థితిపై వచ్చే ప్రతికూల కథనాలను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా బాధ్యతాయుతంగా స్పందించాలని సూచించారు మంత్రి.. క్షేత్రస్థాయిలో సమస్యలను వెంటనే పరిష్కరిస్తూ ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం పెంచేలా పనిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు ఆర్&బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి..

