ఆడబిడ్డలపై అభాండాలు వేసి వీధిన పెడితే కచ్చితంగా జైల్లో పెడతామని హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడారు. ‘‘ఆడపిల్లలనే కనికరం లేకుండా వైఎస్ఆర్సీపీ నీచంగా ప్రవర్తిస్తోంది. ప్రభుత్వంపై బురదజల్లాలనే లక్ష్యంతో ఏ ఘటన జరిగినా రాజకీయం చేస్తోంది. యువతి, మహిళల మర్యాద, గౌరవాలను వీధిన పెట్టేందుకు తెగిస్తోంది. నిన్న శ్రీకాకుళం డిగ్రీ యువతి ఘటననే అందుకు నిదర్శనం. అమ్మాయిపై భౌతిక దాడి కారణంగా స్పృహ తప్పి పడిపోయింది. దీనిపై తప్పుడు సమాచారం ఇచ్చిన ప్రభుత్వ హాస్టల్ వార్డెన్ కూడా సస్పెండ్ చేశాం. మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన, వైసీపీ నాయకులు లైంగికదాడి అంటూ నీచ ప్రచారానికి తెరలేపారు. అమ్మాయిపై దాడి మాత్రమే జరిగిందని విచారణలోనూ నిర్ధారణ జరిగింది. నిజానిజాలు తేలకుండా ఓ ఆడబిడ్డపై విషప్రచారం చేయాల్సిన అవసరమేంటి?, మానవతా దృక్పథం కోల్పోయి రాక్షసంగా ప్రవర్తిస్తారా? ఆ కుటుంబం పరువు గురించి కనీసం ఆలోచించారా? తల్లిదండ్రులు కూడా ఆ కోణంలో ఒక్క మాట మాట్లాడకపోయినా మీకెందుకు అంత కుట్రల ఆరాటం?.’’ అంటూ మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: Dil Raju :‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా నాకు గుణపాఠం నేర్పింది.. దిల్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
‘‘నందిగామలో ప్రమాదాన్ని కూడా టీడీపీ కార్యకర్తల హత్యగా ఆరోపించడం హేయం. గతంలో పుంగనూరులో ఓ మైనర్ బాలిక హత్య ఘటనను కూడా రేప్గా చిత్రీకరించాలని తెగ ప్రయత్నించారు. మీ అబద్ధాల ట్వీట్లతో కుటుంబాలు పడే వేదన తెలుసా?, నిజంగా రేప్ జరిగితే కూటమి ప్రభుత్వం నిందితులను వదిలే ప్రసక్తే లేదు. గంట్లో స్పందించి పోలీసులు రాజీపడకుండా అదుపులోకి తీసుకుని అరెస్ట్లు చేస్తున్నారు. ఇటీవల అనకాపల్లి హాకీ క్రీడాకారుడు ఓ యువతిపై అత్యాచారం చేస్తే అతన్ని అరెస్ట్ చేశాం. గత ఐదేళ్లలో జరిగిన అరాచకాలు, విధ్వంసాలు మరచారా?, కంత్రీ పనులు చేసి న్యూడ్ వీడియో కాల్స్ చేసినోళ్లు వైసీపీ మంత్రులు, ఎంపీలు. చివరి 20 రోజుల్లో ఘటనలంటూ వైసీపీ ట్వీట్లు చేస్తోంది. వైసీపీ ఐదేళ్ల పాలనలో అరాచకాలపై పుస్తకం వేస్తే.. ఏం చర్యలు తీసుకున్నారు?, నిందితులకు వంతలు పాడి కాపాడడానికి ఇక్కడున్నది వైసీపీ ప్రభుత్వం కాదు. కూటమి ప్రభుత్వంలో 10 శాతం నేరాలు తగ్గాయి. ఎక్కడికక్కడ డ్రోన్లు, సీసీ కెమెరాలను విరివిరిగా వినియోగించి నేరరహిత సమాజం దిశగా అడుగులేస్తున్నాం. నేరం జరిగిందా లేదా? తేల్చుకోకుండా మానవతా దృక్పథం మరచి ప్రవర్తిస్తే చట్టపరంగా చర్యలుంటాయ్.’’ అని తెలిపారు.
‘‘మీ ఇంట్లో కూడా ఆడపిల్లలున్నారన్న విచక్షణ మరచిపోయి మృగాళ్ల ప్రవర్తించకండి. దిశ యాప్ పని చేస్తే దిశ చట్టం నిజంగా ఉంటే గత ప్రభుత్వంలో ఆడబిడ్డలపై అన్ని అత్యాచారాలెలా జరిగాయి?, డిగ్రీ చదువుతున్న ఆడబిడ్డపై అత్యాచారమనే ప్రచారం వల్ల తర్వాత దుష్ప్రరిణామాలకు బాధ్యులెవరు?, అత్యాచారం జరిగితేనే మీడియాలో పేర్లు రాయకూడదనే చట్టాలున్నా ఆ సున్నితమైన అంశాలు కనపడవా?, ప్రభావితమైన సామాజిక మాధ్యమాలను బాధ్యతగా వినియోగించుకోండి, నిజమని తేలేలోపు అబద్ధం అవధులు లేకుండా తిరిగొస్తోంది. విచారణ చేసి చట్టపరంగా చర్యలు చేపడతాం. చిన్న ఆరోపణ చేస్తే గత వైసీపీ ప్రభుత్వం గౌతు శిరీషని సీఐడీ అరెస్ట్ చేసింది. 6 నెలల్లోనే ఓ చిన్నారిపై అత్యాచారం నేపథ్యంలో ఫోక్సో కేసు పెట్టి 20 ఏళ్ల జైలు శిక్ష వేయించిన ప్రభుత్వం మాది.’’ అని అనిత పేర్కొ్న్నారు.
ఇది కూడా చదవండి: Honda City Apex Edition: మార్కెట్ లోకి హోండా సిటీ అపెక్స్ లిమిటెడ్ ఎడిషన్.. ధర ఎంతంటే?