AP Government: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టరేట్లలో సిబ్బంది నియామక విధానాన్ని ఏకరీతిలో అమలు చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని 28 జిల్లా కలెక్టరేట్లలో ఒకే రకమైన కేడర్ స్ట్రెంగ్త్ అమల్లోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పాటైన మార్కాపురం, పోలవరం కలెక్టరేట్లతో పాటు అన్ని జిల్లాల్లో యూనిఫాం స్టాఫింగ్ ప్యాటర్న్ అమలు కానుంది. కొత్త ఉత్తర్వుల ప్రకారం ప్రతి జిల్లా కలెక్టరేట్కు గరిష్టంగా 85 పోస్టులు మాత్రమే కేటాయించనున్నారు. ఇందులో 53 రెగ్యులర్ పోస్టులు, 32 ఔట్సోర్సింగ్ పోస్టులు ఉంటాయి. అన్ని కలెక్టరేట్లలో ఒకే విధమైన సిబ్బంది నిర్మాణం ఉండేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
సిబ్బంది పునర్వ్యవస్థీకరణలో భాగంగా కలెక్టరేట్లలో మిగులుగా ఉన్న 95 పోస్టులను ప్రభుత్వం రద్దు చేసింది. వీటిలో 21 సీనియర్ అసిస్టెంట్ పోస్టులు, 29 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, 12 టైపిస్ట్ పోస్టులతో పాటు ఇతర విభాగాలకు చెందిన పోస్టులు కూడా ఉన్నాయి. అలాగే పాత కలెక్టరేట్లలో అవసరానికి మించి ఉన్న సిబ్బందిని కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు సర్దుబాటు చేయాలని ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (CCLA)కు ఆదేశాలు జారీ చేసింది. పరిపాలనలో సమర్థత పెంచడం, అన్ని జిల్లాల్లో సమానమైన సిబ్బంది వ్యవస్థను ఏర్పాటు చేయడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశ్యంగా ప్రభుత్వం పేర్కొంది.

