AP Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సర్కార్‌ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ

Ap Petrol Shortage

Ap Petrol Shortage

AP Petrol Shortage: ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత వేధిస్తోంది.. చాలా పెట్రోల్‌ బంక్‌లు మూతపడ్డాయి.. నో స్టాక్‌ బోర్డులు పెట్టేశారు.. ఈ పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇంధన సరఫరాలో అంతరాయం కలగకుండా చర్యలు చేపడుతూ, బ్లాక్ మార్కెట్ దందాపై కఠిన చర్యలకు సిద్ధమైంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పెట్రోల్ బంకులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా టాస్క్ ఫోర్స్ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపిన ప్రభుత్వం, మొబైల్ స్క్వాడ్స్‌తో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తోంది. జిల్లాల వారీగా ప్రత్యేక టీమ్స్ బంకులను తనిఖీ చేస్తూ నిల్వలు, అమ్మకాల వివరాలను పరిశీలిస్తున్నాయి.

Read Also: Rajya Sabha: బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం.. రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం

ఈ తనిఖీల్లో భాగంగా బంకుల స్టాక్ రిజిస్టర్లు, అమ్మకాల రికార్డులు, కొనుగోలు లెక్కలను అధికారులు పరిశీలిస్తున్నారు. గత 15 రోజులుగా ఇంధన సరఫరా, వినియోగానికి సంబంధించిన పూర్తి డేటాను సేకరిస్తున్నారు. అదేవిధంగా, పెట్రోల్ పంపులలోని మెషిన్ రీడింగ్స్, నోజిల్ డేటాను కూడా అధికారులు క్రాస్ చెక్ చేస్తున్నారు. ఎక్కడైనా సరఫరా లెక్కల్లో తేడాలు, అక్రమ నిల్వలు లేదా అనధికార విక్రయాలు ఉన్నాయా అనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.

రాష్ట్రంలో అమలవుతున్న రేషనలైజేషన్ విధానంపై కూడా ప్రత్యేక ఆడిట్ చేపట్టారు. ఇంధన సరఫరా సరైన విధంగా జరుగుతోందా, ఎక్కడైనా నిల్వలు దాచిపెట్టి అధిక ధరలకు విక్రయిస్తున్నారా అనే అంశాలను సమగ్రంగా పరిశీలిస్తున్నారు. అక్రమాలు బయటపడిన పెట్రోల్ బంకులపై కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. లైసెన్స్ రద్దు నుంచి భారీ జరిమానాలు, క్రిమినల్ కేసులు వరకు చర్యలు తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఇంధన కొరత పేరుతో వినియోగదారులను ఇబ్బంది పెట్టే వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని అధికారులు చెబుతున్నారు. ప్రజలు కూడా ఎక్కడైనా అధిక ధరలు వసూలు చేసినా, సరఫరా నిలిపివేసినా వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు.