AP Cabinet: ఈ రోజు ఉదయం 10:30 గంటలకు సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని ఖరారు చేస్తూ, దానికి చట్టబద్ధత కల్పించే తీర్మానాన్ని మంత్రి వర్గం ఆమోదించనుంది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఈ నెల 28వ తేదీ ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టే తీర్మానానికి ముందుగా కేబినెట్ ఆమోదం తెలపనుంది. అనంతరం ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపించే ప్రక్రియ కొనసాగనుంది.
Read Also: Strait of Hormuz: భారత్ కు ఊరట.. హర్మూజ్ జలసంధి గుండా నౌకలు ప్రయాణించడానికి ఇరాన్ అనుమతి
ఇక ఈ సమావేశంలో పలు సంస్థలకు భూ కేటాయింపులపై కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించడం, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం లక్ష్యంగా ఈ నిర్ణయాలు ఉండనున్నాయి. కేబినెట్ అజెండా ముగిసిన తర్వాత రాష్ట్రంలో వివిధ రంగాలపై యుద్ధ ప్రభావం గురించి శాఖల వారీగా సమీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటికే గ్యాస్ కొరత కారణంగా పలు రంగాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా హోటల్ రంగంపై దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో హోటళ్లు మూతపడిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎల్పీజీ (LPG) నుండి పీఎన్జీ (PNG)కి మార్పు చేసే అంశంపై కూడా కేబినెట్లో చర్చించనున్నారు. గ్యాస్ సిలిండర్ల కొరతకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని సమాచారం.
