AP Collectors Conference: మరోసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్కు సిద్ధం అవుతున్నారు సీఎం చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఈ నెల 10, 11 తేదీల్లో 8వ కలెక్టర్ల సదస్సు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రెండు రోజుల పాటు జరిగే ఈ కలెక్టర్ల కాన్ఫరెన్స్కు రాష్ట్ర మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. జిల్లాల వారీగా ప్రభుత్వ కార్యక్రమాల అమలు, అభివృద్ధి లక్ష్యాలపై సదస్సులో విస్తృతంగా చర్చించనున్నారు.
తొలి రోజు కీలక అంశాలపై సమీక్ష
కలెక్టర్ల సదస్సు తొలి రోజు గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై ప్రధానంగా సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధి, జిల్లా వారీగా నిర్దేశించిన లక్ష్యాలపై అధికారులు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. స్వర్ణ ఆంధ్ర–2047 జిల్లా రోడ్మ్యాప్లపై ప్రత్యేకంగా చర్చ జరగనుంది. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్, వివిధ సంక్షేమ పథకాల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తారు. ఆరోగ్యం, విద్యాశాఖల పనితీరుపై జిల్లా కలెక్టర్లతో చర్చించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పురోగతిపైనా సమీక్ష ఉంటుంది. జలధార కార్యక్రమం అమలు, పురోగతిపై కూడా కలెక్టర్ల నుంచి వివరాలు తీసుకోనున్నారు. జిల్లాల కలెక్టర్లు చేపట్టిన ఉత్తమ ఆవిష్కరణలకు ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసి, వాటి వివరాలను సదస్సులో వివరిస్తారు.
రెండో రోజు ఈ అంశాలపై చర్చ
సదస్సు రెండో రోజు ఈ-గవర్నెన్స్, RTGS, PGRS పనితీరుపై సమీక్ష నిర్వహించనున్నారు. భూ పరిపాలనకు సంబంధించిన అంశాలతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాల కింద రాష్ట్రానికి అందుతున్న నిధులు, వాటి వినియోగంపై చర్చ జరగనుంది. జిల్లా కలెక్టర్లతో ఓపెన్ ఫోరం నిర్వహించి క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను నేరుగా చర్చించనున్నారు. జిల్లాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ఉన్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై ఈ వేదికలో చర్చించే అవకాశం ఉంది.
శాంతిభద్రతలపై సమీక్ష.. సీఎం ముగింపు ప్రసంగం
రెండో రోజు రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితిపైనా సమగ్ర సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సదస్సును ఉద్దేశించి ముగింపు ప్రసంగం చేయనున్నారు. రెండు రోజుల సదస్సులో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలను క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయడంపై దిశానిర్దేశం చేయనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కాగా, ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు.. వివిధ అభివృద్ధి కార్యక్రమాలు.. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు.. భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై ఎప్పటికప్పుడు కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ.. దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు సీఎం చంద్రబాబు..

