Andhra Pradesh Tax Revenue: ఆంధ్రప్రదేశ్ పన్నుల రాబడిలో గణనీయమైన వృద్ధి నమోదైంది. ఈ ఏడాది ఆగస్టు నెలలో రాష్ట్ర పన్నుల ఆదాయం 18.05 శాతం పెరిగినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గతేడాది ఆగస్టుతో పోల్చితే ఈసారి పన్నుల వసూళ్లలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. గతేడాది ఆగస్టు నెలలో రాష్ట్రానికి రూ.21,558.09 కోట్ల పన్నుల రాబడి వచ్చింది. ఈ ఏడాది ఇదే నెలలో పన్నుల ఆదాయం రూ.25,449.80 కోట్లకు చేరింది. గతేడాదితో పోలిస్తే ఆగస్టులో రూ.3,891.71 కోట్ల అదనపు ఆదాయం నమోదైంది.
నికర పన్నుల వసూళ్లలోనూ సుమారు 18 శాతం వృద్ధి నమోదైనట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పన్నుల వసూళ్లు పెరగడానికి వాణిజ్య పన్నుల శాఖ చేపట్టిన పలు సాంకేతిక చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని పేర్కొన్నాయి. వాణిజ్య పన్నుల శాఖలో ప్రభుత్వం ఏఐ ఆధారిత స్క్రూటినీ విధానాన్ని ప్రవేశపెట్టింది. పన్ను చెల్లింపుల్లో అక్రమాలు, వ్యత్యాసాలను గుర్తించడంతో పాటు వసూళ్లను మెరుగుపరిచేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా పన్నులు చెల్లించే విధానాన్ని మరింత సరళతరం చేయడం కూడా ఆదాయం పెరగడానికి కారణమవుతోందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సాంకేతికత వినియోగం, ఏఐ ఆధారిత పరిశీలన, పన్ను చెల్లింపుల సరళీకరణతో భవిష్యత్తులో రాష్ట్ర పన్నుల ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

