Andhra Pradesh Rain Alert: ఆంధ్రప్రదేశ్లో మరోసారి వర్షాలు జోరందుకోనున్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏలూరు నుంచి ప్రకాశం జిల్లా వరకు వర్షాల ప్రభావం అధికంగా ఉండనుంది. ఉమ్మడి గుంటూరు, కృష్ణ, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రాయలసీమలోని పలు ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ప్రస్తుతం కోస్తాంధ్ర నుంచి తెలంగాణ మీదుగా మధ్య మహారాష్ట్ర వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది. అలాగే ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫాన్ ఆవర్తనం కొనసాగుతోంది. ఈ రెండు వాతావరణ వ్యవస్థల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాల తీవ్రత పెరిగే అవకాశముందని వాతావరణ నిపుణులు తెలిపారు. అదేవిధంగా కోస్తా తీరం వెంబడి గంటకు 50 కిలోమీటర్ల వరకు వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

