Site icon NTV Telugu

Municipal Ward Delimitation: మున్సిపాలిటీల పునర్విభజన ప్రక్రియకు గడువు పెంచిన సర్కార్..

Ap Govt

Ap Govt

Municipal Ward Delimitation: మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియకు గడువు పెంచింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఫీల్డ్ స్టాఫ్, టౌన్ ప్లానింగ్ సిబ్బంది 2027 జనగణన పనుల్లో నిమగ్నం కావడంతో డీలిమిటేషన్ పనులు ఆలస్యం కానున్నాయి.. రెవెన్యూ సిబ్బంది కూడా జనగణన కార్యకలాపాల్లో ఉండటంతో ప్రస్తుత షెడ్యూల్ అమలు కష్టంగా మారినట్లు అధికారులు మున్సిపల్ శాఖ దృష్టికి తీసుకెళ్లారు.. వార్డుల పునర్విభజనలో జనాభా గణాంకాల ఖచ్చితత్వం, ఫీల్డ్ స్థాయి పరిశీలన కీలకమని స్పష్టం చేశారు.. సరిహద్దుల సరిపోల్చడం, భౌగోళిక సవరణలు చేయడానికి మరింత సమయం అవసరమని నిర్ణయం తీసుకుంది మున్సిపల్ శాఖ… తొందరపాటుతో డీలిమిటేషన్ చేస్తే తప్పులు, వివాదాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్పడంతో కొంత సమయం ఇస్తూ సర్క్యులర్ జారీ చేశారు..

Read Also: RK Roja: రాజకీయాలంటేనే టెన్షన్‌.. ఎమ్మెల్యే అయ్యాకే బీపీ, షుగర్‌ ఎటాక్..!

ప్రాథమిక నోటిఫికేషన్ జారీకి ముందు అన్ని అంశాలు సమగ్రంగా పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసింది మున్సిపల్‌ శాఖ.. చట్టపరమైన అభ్యంతరాలు, అప్పీలు తగ్గించేందుకు కచ్చితమైన ప్రక్రియ పాటించాలని సూచించింది.. గతంలో విడుదలైన షెడ్యూల్‌ను రద్దు చేసి కొత్త షెడ్యూల్ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్లకు సర్క్యులర్ పంపింది మున్సిపల్ పరిపాలన డైరెక్టర్ కార్యాలయం.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు వర్తించేలా ఉత్తర్వులు జారీ చేశారు.. దీంతో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది..

Exit mobile version