Quantum Valley: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో క్వాంటం టెక్నాలజీ రంగంలో కీలక అడుగు పడింది. క్వాంటం వ్యాలీ అభివృద్ధికి ప్రభుత్వం 50 ఎకరాల భూమి కేటాయించింది. ఇందులో భాగంగా, రెండు ఎకరాల్లో అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సీఆర్డీఏ కార్యాలయానికి సమీపంలోని సీడ్ యాక్సెస్ రోడ్ పక్కనే భవన నిర్మాణం కోసం భూమి కేటాయింపు పూర్తయింది. ఈ నిర్మాణ పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ నెల 6తో టెండర్ల దాఖలు గడువు ముగియనుంది.
Read Also: Bollywood : హిందీలో ఆరు సినిమాలతో షేకాడిస్తున్న పాల బ్యూటీ
అయితే, శాశ్వత భవనం నిర్మాణం పూర్తయ్యే వరకు, రాజధాని పరిధిలోని ఒక ప్రైవేట్ యూనివర్శిటీలో తాత్కాలిక క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనంతరం సెంటర్ను రాయపూడిలో నిర్మిస్తున్న శాశ్వత భవనానికి తరలించనున్నారు. ఇక, ప్రతిపాదిత క్వాంటం భవనం గ్రీన్ బిల్డింగ్ రూపకల్పనతో Z+1 ఫ్లోర్ డిజైన్లో నిర్మించనున్నారు. మొత్తం నిర్మాణ విస్తీర్ణం 4,201 చదరపు మీటర్లు కాగా.. గ్రౌండ్ ఫ్లోర్: 1,990 చద.మీ. ఫస్ట్ ఫ్లోర్: 1,996 చద.మీ.. బేస్మెంట్: 210 చద.మీ. అదనంగా: హెడ్రూమ్ 109 చద.మీ., డెక్ ఏరియా 130 చద.మీటర్లుగా ఉండనుంది..
క్వాంటం కంప్యూటింగ్ ప్రాజెక్ట్ అమలులో టిసిఎస్ సాంకేతిక భాగస్వామిగా, ఎల్ అండ్ టీ నిర్మాణ సంస్థగా పనిచేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మూడు కంపెనీలతో ఒప్పందాలు ఇప్పటికే పూర్తయ్యాయి. భవన నిర్మాణ వ్యయాన్ని సీఆర్డీఏ మరియు ఐటీ అండ్ ఈ శాఖలు సంయుక్తంగా భరించనున్నట్లు టెండర్ నిబంధనల్లో పేర్కొన్నారు. ఇదే క్రమంలో ప్రభుత్వం ఇప్పటికే క్వాంటం టెక్నాలజీ పాలసీని విడుదల చేసి, అమరావతిని జాతీయ క్వాంటం ఇన్నోవేషన్ హబ్గా అభివృద్ధి చేయాలని స్పష్టం చేసింది.
