Site icon NTV Telugu

CM Chandrababu: అమరావతి ఇక అన్‌స్టాపబుల్‌.. ఇది చారిత్రాత్మకం.. మోడీ, అమిత్‌షాకు హృదయపూర్వక ధన్యవాదాలు

Cbn

Cbn

CM Chandrababu: రాజధానిగా అమరావతికి చట్టబద్దత లభించడం రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పార్లమెంటులోని ఉభయ సభల్లో ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు, 2026’ ఏకగ్రీవంగా ఆమోదం పొందటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల సుదీర్ఘ నిరీక్షణకు, వారి సంకల్పానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని, ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలు నేడు దేశ రాజధానిలో ప్రతిధ్వనించాయని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలియజేశారు.

Read Also: MG Starlight 560: భారత్ లో విడుదల కానున్న ఎంజీ స్టార్‌లైట్ 560.. దీని ప్రత్యేకతలు ఏమిటి?

అమరావతి ప్రస్థానంలో ప్రధాని మోడీ ప్రతీ కీలక సందర్భంలోనూ అండగా నిలిచారని గుర్తు చేశారు చంద్రబాబు. 2015 అక్టోబర్ 22 తేదీన అమరావతికి శంకుస్థాపన చేయటంతో పాటు, 2025 మే 2న అమరావతి పునర్నిర్మాణ పనులను కూడా ప్రధాని మోడీ చేతుల మీదుగానే ప్రారంభించుకోవడం గర్వకారణమని సీఎం పేర్కొన్నారు. అమరావతికి వెన్నుదన్నుగా నిలిచిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ప్రభుత్వానికి, రాజధాని బిల్లుకు మద్దతు తెలిపిన అన్ని రాజకీయ పార్టీలకు, పార్లమెంటు సభ్యులకు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని లేక అనేక సవాళ్లను, అనిశ్చితిని ఎదుర్కొందని.. అలాంటి క్లిష్ట సమయంలో అమరావతి రైతులు చేసిన అమూల్యమైన త్యాగం, వారి పట్టుదల, నమ్మకం రాజధాని కలను సజీవంగా ఉంచాయని కొనియాడారు.

ఇక, ఈ చారిత్రక విజయాన్ని అమరావతి రైతులకు అంకితం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అమరావతిని ఏకైక ప్రజా రాజధానిగా పేర్కొంటూ పార్లమెంట్ తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రంలో ఒక కొత్త శకానికి నాంది పలికిందన్నారు. రాజధానిగా అమరావతి హోదా ఇక సుస్థిరం. దీనిపై ఇక ఎటువంటి అనుమానాలకు, చర్చలకు తావులేదన్నారు. ఆంధ్రప్రదేశ్ కు గుండె, ఆత్మ అయిన అమరావతి ఇక అన్‌స్టాపబుల్ అని సీఎం పేర్కొన్నారు. దేశానికే అమరావతి ఒక అద్వితీయమైన భవిష్యత్ నగరంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. అమరావతి ద్వారా లభించే ఈ స్థిరత్వం ప్రతీ ఆంధ్రుడిలో కొత్త విశ్వాసాన్ని నింపాలని ఆయన ఆకాంక్షించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…

Exit mobile version