భారత క్రికెట్ దిగ్గజ మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో సచిన్ స్నేహితురాలు తీవ్రంగా గాయపడింది. ఆ సమయంలో వెంటనే స్పందించిన ట్రాఫిక్ కానిస్టేబుల్, పౌరులను ట్విటర్ వేదికగా సచిన్ అభినందించాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్ను నేరుగా కలిసి ధన్యవాదాలు చెప్పినట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడి సీరియస్ కండిషన్లో ఉన్న తన స్నేహితురాలిని ట్రాఫిక్ కానిస్టేబుల్ ఓ ఆటోలో ఆస్పత్రికి తీసుకువెళ్లాడని.. అప్పటికే ఆమె వెన్నెముకకు బాగా దెబ్బలు తగలగా.. ఆటోలో కుదుపులకు వెన్నెముక మరింత గాయపడే అవకాశం ఉండడంతో, కుదుపులకు గురికాకుండా ట్రాఫిక్ కానిస్టేబుల్ దగ్గరుండి మరీ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాడని సచిన్ తెలిపాడు.
Read Also: సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కొత్త బౌలింగ్ కోచ్
కాగా బాధితురాలు ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్లు సచిన్ వెల్లడించాడు. మన చుట్టూ ఇటువంటి పౌరులు ఉండటం వల్లనేమో ప్రపంచం చాలా అందంగా ఉంటుందని సచిన్ అభిప్రాయపడ్డాడు. మంచివాళ్లు తమ విధి నిర్వహణకు మించి సాయపడేందుకు సిద్ధంగా ఉంటారన్నాడు. మనకు ఎప్పుడైనా ఇలాంటి పరోపకారులు కనిపిస్తే ఒక్క క్షణం ఆగైనా సరే వారిని అభినందించాలని సచిన్ సూచించాడు. వాళ్లెవరో మనకు తెలియకపోవచ్చు… కానీ ఇతరుల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు నిశ్శబ్దంగా పనిచేస్తుంటారని సచిన్ పేర్కొన్నాడు.
