తెలంగాణపై జనసేనాని ఫోకస్‌.. 9న కీలక సమావేశం

ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ రాజకీయాలపై ఫోకస్‌ పెట్టారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్… అందులో భాగంగా ఈ నెల 9వ తేదీన హైదరాబాద్‌లో జనసేన తెలంగాణ శాఖ సమావేశం కానుంది.. ఈ భేటీకి జనసేన క్రియాశీలక కార్యకర్తలకు ఇప్పటికే ఆహ్వానాలు పంపించారు.. హైదరాబాద్‌ అజీజ్‌ నగర్‌లోని జీపీఎల్‌ కన్వెన్షన్‌ 9వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. పార్టీ నిర్మాణంలో భాగంగా తెలంగాణలో క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తూ కమిటీల నియామకం సాగుతోంది.. ఈ క్రమంలో పార్టీలో క్రియాశీలక సభ్యులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ సమావేశాన్ని ఉద్దేశించే జనసేనాని పవన్‌ ల్యాణ్ కీలకోపన్యాసం చేయనున్నారని తెలుస్తోంది.. రాష్ట్రంలో పార్టీని ముందుకు తీసుకెళ్లడం, సంస్థాగత నిర్మాణం, ప్రజల పక్షాన నిలబడి పోరాడటంపై కార్యకర్తలు, నాయకులకు దిశానిర్ధేశం చేస్తారు జనసేనాని. మరోవైపు.. తెలంగాణలోని హుజురాబాద్‌ అసెంబ్లీ స్థానాకి ఉప ఎన్నికలు జరుగుతోన్న సమయంలో.. జనసేన సమావేశం నిర్వహించడం ఆసక్తికరంగా మారింది.. హుజురాబాద్‌ బై పోల్‌లో బీజేపీ తరపున బరిలోకి దిగిన ఈటల రాజేందర్‌కు జనసేన మద్దతు ప్రకటిస్తుందనే చర్చ కూడా సాగుతుండగా.. మరి, పవన్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.