NTV Telugu Site icon

25 నుంచి ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు

inter exams 1

కరోనా కారణంగా గత సంవత్సరం ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థులను పరీక్షలు లేకుండానే పాస్‌ చేశారు. వారు ప్రస్తుతం ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం ఇంటర్ సెకండ్‌ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 25 నుండి నవంబర్ 3 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ ఇంటర్‌ బోర్డు సెక్రటరీ ఉమర్‌ జలీల్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా రెండు పరీక్షలను రీ షెడ్యూల్ చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఆదివారం రోజు కూడా పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. 70 శాతం సిలబస్ నుండి ప్రశ్నలు ఉంటాయని, ప్రశ్నల్లో 50 శాతానికి పైగా ఛాయిస్ రూపంలో ప్రశ్నాపత్రాలు ఉండనున్నట్లు తెలిపారు. 4 లక్షల 59 వేలు 237 మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారని, వారికోసం 17 వందల 68 పరీక్ష సెంటర్ లు ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్షల నిర్వహణకు వాక్సిన్ తీసుకున్న 25 వేల మంది ఇన్విజిలేటర్స్‌ను నియమంచినట్లు ఆయన వెల్లడించారు.

మూడు సెట్ల ప్రశ్న పత్రాలు సంబంధిత  పోలీస్ స్టేషన్లకి చేరాయని, మానసిక నిపుణులను కూడా ఏర్పాటు చేశామని, విద్యార్థులు ఒత్తిడికి లోను కావొద్దు, భయ పడొద్దని ఆయన సూచించారు. విద్యార్థులు తెచ్చుకునే వాటర్ బాటిల్స్ కి అనుమతి ఇస్తామని, థర్మల్ స్క్రీనింగ్ ఉంటుందని, ఎవరికైనా జ్వరం లక్షణాలు ఉంటే ప్రత్యేక రూమ్ లో పరీక్ష నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు ఆన్లైన్ ద్వారా డౌన్ లోడ్ చేసుకున్న హాల్ టికెట్స్ సరిపోతాయని, వాటిపైన ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదని స్పష్టం చేశారు.

ఇప్పటి వరకు 82 శాతం హాల్ టికెట్ డౌన్ లోడ్స్ చేసుకున్నారని, ఎవరైనా విద్యార్థుల పరీక్ష ఫీ సంబంధిత కాలేజీలకు చెల్లించక పోతే అలాంటి వారు ఇంటర్ బోర్డ్ ను సంప్రదిస్తే పరీక్ష రాసే అవకాశం ఇస్తామని తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఎక్కడ చదివారో ఆ జోన్ లోనే పరీక్ష రాయాలన్నారు. ప్రతి సెంటర్ లో మెడికల్ కిట్స్, సానిటైజేషన్ అందుబాటులో ఉంటాయన్నారు.