NTV Telugu Site icon

డ్రంకెన్‌ డ్రైవ్‌లో వాహనాలను సీజ్ చేయవద్దు : సైబరాబాద్‌ సీపీ

డ్రంకెన్‌ డ్రైవ్‌ లో వాహనాలను సీజ్ చేయవద్దని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్ రవీంద్ర పోలీసులకు ఆదేశించారు. ఈ మేరకు కమిషనరేట్‌ మినీ కాన్ఫరెన్స్‌హాల్లో ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌ కుమార్‌ నేతృత్వంలో ట్రాఫిక్‌ ఉన్నతాధికారులు, సిబ్బందితో సీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్టీఫెన్‌ రవీంద్ర మాట్లాడుతూ.. రహదారి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి ప్రమాదాలను గణనీయంగా తగ్గించడానికి కృషి చేయాలన్నారు. ట్రాఫిక్‌ అవగాహన సమావేశాలు పెంచాలన్నారు.

పాదచారుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకొని రోడ్డు దాటేటప్పుడు ట్రాఫిక్‌ సిబ్బంది వారికి సహకరించాలన్నారు. డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు, వాహనాల జప్తు విషయంలో ట్రాఫిక్‌ పోలీసులు హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను, ప్రొసీడింగ్స్‌ను కచ్చితంగా పాటించాలని స్టీఫెన్‌ రవీంద్ర పేర్కొన్నారు. న్యాయస్థానం నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు సీజ్‌ చేయొద్దని సూచించారు.