Telangana High Court : పేద కుటుంబాలకు ఆర్థిక చేయూతనందించే ‘కల్యాణలక్ష్మి’, ‘షాదీ ముబారక్’ పథకాల అమలుపై తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఈ పథకాల నిధుల విడుదలపై ఇచ్చిన మధ్యంతర స్టేను సవరిస్తూ, దివ్యాంగ వధువులకు సంబంధించి ఊరటనిచ్చే నిర్ణయాన్ని వెల్లడించింది.
దివ్యాంగులకు స్టే ఎత్తివేత.. మిగతా వారికి కొనసాగింపు
దివ్యాంగ వధువులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద అందించే ఆర్థిక సాయంపై గతంలో విధించిన స్టేను హైకోర్టు తొలగించింది. దీంతో దివ్యాంగ లబ్ధిదారులకు నిధుల విడుదల ప్రక్రియ తిరిగి ప్రారంభం కానుంది. అయితే దివ్యాంగులు మినహా మిగిలిన సాధారణ వర్గాల లబ్ధిదారులకు సంబంధించి మాత్రం నిధుల విడుదలపై ఉన్న స్టే యథాతథంగా కొనసాగుతుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.
కౌంటర్ దాఖలుకు ప్రభుత్వానికి రెండు వారాల గడువు
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు సంబంధించిన చట్టబద్ధత, జీవోల అమలుపై తమ వాదనలు విన్పించేందుకు, పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ సమర్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానాన్ని సమయం కోరింది. దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం, ప్రభుత్వ విన్నపాన్ని పరిశీలించి కౌంటర్ దాఖలుకు రెండు వారాల గడువు మంజూరు చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.

