Telangana MLC Elections : తెలంగాణ రాష్ట్రంలోని రెండు ప్రధాన పట్టభద్రుల (గ్రాడ్యుయేట్స్) ఎమ్మెల్సీ నియోజకవర్గాల స్థానాలు మార్చి 2027లో ఖాళీ కానున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల కమిషన్ కొత్త ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. ఇందులో భాగంగా మహబూబ్నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ , వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలకు కొత్తగా ఓటరు నమోదు షెడ్యూల్ను తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) వెల్లడించారు.
ఓటర్ల నమోదు షెడ్యూల్ , కీలక తేదీలు
ఎన్నికల సంఘం ప్రకటించిన కార్యచరణ ప్రకారం నవంబర్ 1, 2026 నాటికి విద్యార్హత సాధించిన పట్టభద్రులందరూ ఓటరు నమోదుకు అర్హులుగా ఉంటారు. ఓటర్ల నమోదు ప్రక్రియకు సంబంధించి సెప్టెంబర్ 28న అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 6 వరకు ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఆ తర్వాత అధికారులు ముసాయిదా (డ్రాఫ్ట్) ఓటర్ల జాబితాను నవంబర్ 25న ప్రచురిస్తారు. ఈ ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు లేదా సవరణల కోసం నవంబర్ 25 నుండి డిసెంబర్ 10 వరకు సమయం కేటాయించారు. అభ్యంతరాలన్నింటినీ పరిశీలించి పరిష్కరించిన అనంతరం డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేయనున్నారు.
పాత ఓటర్లు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరి
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతిసారి పాత ఓటర్ల జాబితా రద్దవుతుంది. కాబట్టి గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు పొంది ఉన్నప్పటికీ, ఆ ఓటర్లు సైతం ఇప్పుడు తప్పనిసరిగా కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సీఈఓ స్పష్టం చేశారు. ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
దరఖాస్తు విధానం , సమర్పించాల్సిన పత్రాలు
అర్హత కలిగిన పట్టభద్రులు తమ దరఖాస్తులను ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ మార్గాల్లో సమర్పించవచ్చు. ఆన్లైన్లో నమోదు చేసుకోవాలనుకునే వారు సీఈఓ తెలంగాణ అధికారిక వెబ్సైట్ ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో దరఖాస్తు చేయాలనుకునే వారు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిజిగ్నేటెడ్ అధికారుల వద్ద నేరుగా ఫారమ్లు అందజేయవచ్చు. అంతేకాకుండా పూరించిన ఫారం-18ను స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కూడా అధికారులకు పంపే వెసులుబాటు ఉంది. దరఖాస్తు చేసుకునే సమయంలో ఫారం-18తో పాటు గెజిటెడ్ అధికారి లేదా నోటరీతో అటెస్ట్ చేయించిన డిగ్రీ సర్టిఫికేట్ లేదా ప్రొవిజనల్ మార్కుల మేమో ప్రతులను తప్పనిసరిగా జతపరచాల్సి ఉంటుంది.

