తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దళిత బంధు పథకానికి హుజూరాబాద్ ఉప ఎన్నికలు బ్రేక్ వేశాయి.. ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నిక ముగిసే వరకు నియోజకవర్గ పరిధిలో దళితబంధు పథకం అమలును వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.. ఆ పథకం కింద అన్ని దశలలోని నగదు బదిలీ ప్రక్రియను నిలుపుదల చేయాలని స్పష్టం చేసింది ఈసీ.. అయితే, ఈ వ్యవహారంపై సీరియస్గా స్పందించారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు.
ఇవాళ యాదాద్రిలో పర్యటించిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దళిత బంధు విషయంలో ఈసీ ఆదేశాలపై స్పందిస్తూ.. దళిత బంధుపై ఈసీ తన పరిధిని అతిక్రమించిందని వ్యాఖ్యానించారు.. ఎన్నికల కమిషన్.. ఎన్ని రోజులు ఆపగలదు అని ప్రశ్నించారు. దళిత బంధు అర్హులు ఆందోళన చెందవద్దని సూచించిన సీఎం కేసీఆర్.. రెండో తేదీ నుంచే దళిత బంధు తిరిగి ప్రారంభం అవుతుందని తెలిపారు. ఇక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీదే విజయం అంటూ ధీమా వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్.