KCR Emergency Meeting: మంత్రులకు కేసీఆర్‌ పిలుపు.. ఫామ్‌హౌస్‌లో అత్యవసర భేటీ..

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు.. మంత్రులతో అత్యవసరంగా సమావేశం అయ్యారు.. ఎర్రవెల్లిలోని తమ ఫామ్‌హౌస్‌కి రావాలంటూ ఆయన నుంచి మంత్రులకు సమాచారం వెళ్లింది.. అయితే, ఆకస్మాత్తుగా భేటీ కావడంతో.. ఏ అంశాలపై చర్చిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ భేటీలో మంత్రులతో పాటు సీఎస్ సోమేష్‌ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఫోన్‌ కాల్‌ రావడంతో.. హుటాహుటిన తమ కార్యక్రమాలను రద్దు చేసుకుని.. ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు మంత్రులు హరీష్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, గంగుల కమలాకర్‌, ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, జగదీష్‌రెడ్డి.. ఇక, అమెరికా పర్యటనకు వెళ్లిన మంత్రి కేటీఆర్, మహారాష్ట్రలో ఉన్న మంత్రి నిరంజన్‌రెడ్డి, ఖమ్మంలోనే ఉండిపోయిన మంత్రి పువ్వాడ అజయ్‌… ఈ సమావేశానికి హాజరుకాలేకపోయారు. అయితే, ఎమ్మెల్సీ కవిత కూడా ఈ భేటీలో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది.

Read Also: Dwarampudi: త్వరలోనే జనసైనికులు భాధ పడే రోజు.. పవన్ అన్యాయం చేస్తాడు..!

తెలంగాణలో భారీ స్థాయిలో ఖాళీల భర్తీకి సిద్ధమైంది ప్రభుత్వం.. దీనిపై సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు.. దీంతో.. నియామకాలు, వ్యవసాయం, ఇతర అంశాలపై చర్చించనున్నట్టుగా తెలుస్తోంది.. ఉద్యోగాల ప్రకటన చేసినా.. ప్రజల్లో నమ్మకం కుదరడంలేదన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తుండడంతో.. ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి ఏ శాఖలో ఎన్ని ఖాళీలున్నాయి? నోటిఫికేషన్‌కు ఎంత సమయం పడుతుంది? పరీక్షా తేదీలు వంటి కీలక విషయాల గురించి చర్చించే అవకాశం ఉందంటున్నారు.. మరోవైపు జీవో 111 రద్దు గురించి కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.. ఇక, యాదాద్రి పునర్‌ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్‌.. భారీగా నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నారు.. ఈ నెలలోనే యాదాద్రి ఆలయం పునర్‌ ప్రారంభం ఉండడంతో.. ఆ విషయంపై కూడా చర్చ జరగవచ్చునని తెలుస్తోంది.