Site icon NTV Telugu

TS Assembly Session: సస్పెన్షన్‌పై హైకోర్టుకు బీజేపీ ఎమ్మెల్యేలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ 2022-23 సమావేశాలు ప్రారంభం అయిన రోజే బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌ వేటు పడింది.. బడ్జెట్‌ సెషన్‌ మొత్తం బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేస్తూ అధికార పార్టీ తీర్మానం పెట్టడం.. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి దానికి ఆమోదం తెలపడం జరిగిపోయాయి.. అయితే, ముగ్గురు బీజేపీ సభ్యుల సస్పెన్స్ పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజాసింగ్ పిటిషన్‌ దాఖలు చేశారు.. రాజ్యాంగం, అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధంగా సస్పెండ్ చేశారని తమ పిటిషన్‌లో పేర్కొన్న ఎమ్మెల్యేలు.. సస్పెన్షన్ ఉత్తర్వులను కొట్టివేయాలని హైకోర్టును కోరారు.. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు బీజేపీ ఎమ్మెల్యేలు.. సస్పెన్షన్ తీర్మానం, వీడియో రికార్డులు సమర్పించేలా అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించాలని తమ పిటిషన్‌లో పేర్కొన్నారు.

Read Also: Russia Ukraine War: ఎల్లుండి నాల్గో విడత శాంతి చర్చలు..

కాగా, గ‌వ‌ర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ బ‌డ్జెట్ సెషన్‌ ప్రారంభించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై బీజేపీ ఎమ్మెల్యేలు రాజా సింగ్‌, ర‌ఘునంద‌న్ రావు, ఈట‌ల రాజేంద‌ర్‌లు ఆగ్రహం వ్యక్తం చేయడం.. సోమవారం అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం అయిన వెంటనే పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేయడం.. దీంతో వారిని బ‌డ్జెట్ స‌మావేశాల నుంచి స‌స్పెండ్ చేయాల‌ని అధికార పక్షం టీఆర్ఎస్ కోర‌డం, అందుకు స్పీక‌ర్ కూడా ఓకే చెప్పడంతో బీజేపీ ఎమ్మెల్యేల స‌స్పెన్షన్ నిమిషాల వ్యవ‌ధిలోనే జరిగిపోయిన విషయం తెలిసిందే.

Exit mobile version