రేపు హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఎన్నికలు జరుగనున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 1100 కనెక్షన్లతో హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు ప్రారంభమైందని, గ్రేటర్లో 11 లక్షల కనెక్షన్లు పెంచుకున్నామని ఆయన వెల్లడించారు. గ్రేటర్లో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, కృష్ణా, గోదావరి నదీ జలాలను విరివిగా ఉపయోగించుకుంటున్నామని ఆయన తెలిపారు. కొండపోచమ్మ సాగర్ నీటిని కూడా ఉపయోగించుకుంటే మరో 50 సంవత్సరాల వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, తెలంగాణ ప్రభుత్వం ఫ్రెండ్లీ ఎంప్లాయిస్ గవర్నమెంట్ అని ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో ఖాళీ కుండల ప్రదర్శన ఇప్పుడు లేదని, కరోనా సమయంలో మెట్రో వాటర్ వర్క్స్ సిబ్బంది పనులు అనిర్వచనీయమని ఆయన ప్రశంసించారు. మెట్రో వాటర్ వర్క్స్ సిబ్బందికి 7,500 ఇన్సెంటీవ్స్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చారని, వాటర్ వర్క్స్ లో రిక్రూట్ మెంట్ జరుపుతామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ మద్దతుతో ఇంకా వాటర్ వర్క్స్ ను అభివృద్ధి చేస్తామని, మెట్రో వాటర్ వర్క్స్ ఎన్నికల్లో రాంబాబు యాదవ్ను గెలిపించాలని కోరుతున్నానన్నారు.
