TIMS Sanathnagar: సనత్నగర్లోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ జారీ చేసిన తాజా ఆదేశాల మేరకు, ఈ శుక్రవారం నుంచి ఆసుపత్రిలో ట్రయల్ రన్ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఆరోగ్యశాఖ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడమే కాకుండా, సేవలు అందించేందుకు అవసరమైన వైద్యులు , పారామెడికల్ సిబ్బందిని కూడా నియమించింది.
ఈ ట్రయల్ రన్ సుమారు నెల రోజుల పాటు కొనసాగనుంది. ఈ సమయంలో రోజూ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు అవుట్ పేషెంట్ (OP) , డయాగ్నసిస్ సేవలను రోగులకు అందిస్తారు. ముఖ్యంగా కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్ , జనరల్ సర్జరీ వంటి కీలక విభాగాలతో సహా మొత్తం 22 విభాగాల్లో ఈ వైద్య సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ఈ ట్రయల్ రన్ ద్వారా ఆసుపత్రి పనితీరును పరిశీలించి, త్వరలోనే పూర్తిస్థాయిలో వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
