ఈ ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 12 వరకు సమతా కుంభ్ – 2023 జరగనుందని చిన్న జీయర్ స్వామి ప్రకటించారు. ఈమేరకు ప్రెస్మీట్ ఏర్పాటు చేసి దానికి సంబంధించిన వివరాలు తెలిపారు. ఫిబ్రవరి రెండు నుంచి పన్నెండు వరకు శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయని పేర్కొన్నారు. ముచ్చింతల్లో సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం గతేడాది ఫిబ్రవరి 2న ప్రారంభమైందని. 216 అడుగుల పంచలోహ విగ్రహం లోకానికి అందుబాటులోకి వచ్చిందన్నారు.
“సమతా మూర్తి కేంద్రం ప్రారంభమై ఏడాది పూర్తి అవుతుంది. 108 దివ్య ప్రదేశాలు సమతా మూర్తి కేంద్రంలో ఉన్నాయి. ఈ ఏడాదిలోనే కోట్లాది మంది సమతా మూర్తి కేంద్రాన్ని సందర్శించారను. అనేక మంది గత బ్రహ్మోత్సవాలను తిలకించారు.. చూస్తూ చూస్తుండగానే ఒక ఏడాది పూర్తి అయ్యింది.. ఫిబ్రవరి 2 న మొదటి వార్షికోత్సవం జరపబోతున్నాం. నిరుడు లాగే అదే స్థాయిలో వేడుక సాగుతుంది. 9 కుండాలతో ఉండే యాగశాలను ఏర్పాటు చేసి యాగం నిర్వహించనున్నాం. సమతా కుంభ్ పేరుతో ప్రతి సంవత్సరం వేడుకలు నిర్వహిస్తాం” అని చిన్నజీయర్ స్వామి స్పష్టం చేశారు.
బ్రహ్మోత్సవ కార్యక్రమాలు..
- మొదటి రోజు ఫిబ్రవరి రెండు గురువారం నాడు విశేషోత్సవాలు..
- ఫిబ్రవరి మూడు శుక్రవారం ఉదయం సూర్యప్రభ వాహన సేవ, సాయంత్రం చంద్రప్రభ వాహన సేవ..
- ఫిబ్రవరి నాలుగు శనివారం సమతామూర్తికి కృతజ్ఞతాంజలి కీర్తన,రామానుజ నూత్తాందాది సామూహిక పారాయణ..
- ఐదో తారీఖు ఆదివారం సాయంత్రం సకల లోక రక్షకుడికి 108 రూపాలలో చారిత్రాత్మక, అద్భుత శాంతి కళ్యాణ మహోత్సవం..
- ఆరవ తారీఖు సోమవారం నాడు ఉదయం వసంతోత్సవం, సాయంత్రం 18 గరుడసేవలు..
- ఏడో తేదీన మంగళ వారం ఉదయం డోలోత్సవం,హనుమ ద్వాహన సేవ,18 గరుడ సేవలు..
- ఎనిమిదో తేదీన బుధవారం ఉదయం కల్హారోత్సవం, సామూహిక పుష్పార్చన, సాయంత్రం లీలా విహారికి 18 రూపాల్లో తెప్పోత్సవం..
- తొమ్మిదో తేదీన గురువారం ఉదయం సువర్ణ రామానుజులకు ఆచార్య వరి వస్య, సాయంత్రం అశ్వ వాహన సేవ,18 గరుడ సేవలు..
- పదో తేదీన శుక్రవారం ఉదయం సామూహిక ఉపనయనములు, సాయంత్రం గజవాహన సేవ 18 గరుడ సేవలు..
- పదకొండో తేదీన శనివారం ఉదయం రథోత్సవం, చక్ర స్నానం, మధ్యాహ్నం సకల లోక గురుడికి విశ్వశాంతి విరాట్ గీతా పారాయణ..
- ఆఖరి రోజు పన్నెండవ తేదీన ఆదివారం ఉదయం ఉత్సవాన్త స్నపనము, సాయంత్రం మహా పూర్ణాహుతి,కుంభ ప్రోక్షణ తో పాటు వివిధ కార్యక్రమాలు జరుగుతాయి.
