ఇవాళ బీఎస్పీలో చేర‌నున్న ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌

RS Praveen Kumar

RS Praveen Kumar

రాజ్యాధికారం కోసం బహుజనులంతా ఏకం కావాలన్నారు మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌. బహుజనులంతా తన వెంట ఉంటే పేదల హక్కుల కోసం ఎంతటి పోరాటానికైన సిద్ధమని స్పష్టంచేశారు. ఈ రోజు నల్గొండలో తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టనున్నారు. రాజ్యాధికార సంకల్ప సభ పేరిట బహుజన సమాజ్‌ పార్టీ నల్లగొండలో బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో మాజీ ఐపీఎస్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ బీఎస్పీ కండువా కప్పుకోనున్నారు.

బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్‌, రాజ్యసభ ఎంపీ రాంజీ గౌతమ్‌ ఆధ్వర్యంలో పార్టీలో చేరనున్నారు. ఎన్జీ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహించుకునేందుకు అనుమతివ్వాలని జిల్లా ఎస్పీకి దరఖాస్తు చేసుకున్నారు. అక్షరం, ఆర్థికం, ఆరోగ్యం అంశాలే ఎజెండాగా ప్రవీణ్‌కుమార్‌ బీఎస్పీలో చేరనున్నారు. గడిచిన 15 రోజులుగా బీఎస్పీ, స్వేరోస్‌ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి నల్లగొండ సభకు రావాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. వాహనాలను సొంతంగా సమకూర్చుకోవాలని, భోజన ఖర్చు కూడా స్వచ్ఛందంగా భరిస్తూ రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను నియమించి జనసమీకరణ చేశారు.