జమునా హాచరీస్ తొలిరోజు రెవెన్యూ అధికారుల సర్వే ముగిసింది… అచ్చంపేటలోని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కుటుంబ సభ్యులకు చెందిన జమునా హాచరీస్లో ఇవాళ ఉదయం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సర్వే కొనసాగింది.. మొదటి రోజులో భాగంగా 130 సర్వే నెంబర్లోని భూములపై సర్వే చేశారు రెవిన్యూ అధికారులు.. ఇక, రెండో రోజులో భాగంగా బుధవారం రోజు 77, 78, 79, 80, 81, 82 సర్వే నెంబర్లలోని భూమిలోని సర్వే చేయనున్నారు రెవెన్యూ అధికారులు.. అయితే, ఈ సర్వేకు సంబంధించిన పూర్తి నివేదికను మూడుల రోజుల తర్వాత ఇవ్వనున్నారు అధికారులు..
ఇక, జమునా హాచరీస్లో తొలిరోజు జరిగిన సర్వేపై మీడియాతో మాట్లాడిన మాసాయిపేట తహశీల్దార్ మాలతి… మాసాయిపేట మండలం అచ్చంపేట శివారులోని 130 సర్వే నెంబర్లో ఈరోజు సర్వే పూర్తి అయ్యిందన్నారు.. 11 మంది రైతులకు సంబంధించిన మొత్తం 18 ఎకరాల్లో ఈ సర్వే కొనసాగిందన్న ఆమె… పూర్తి వివరాలను ఈ నెల 18వ తేదీన వెల్లడిస్తామని తెలిపారు. కాగా, మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్పై భూ కబ్జా ఆరోపణలు రావడంతో.. ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించడం.. ఆ తర్వాత టీఆర్ఎస్కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం.. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రాతినిథ్యం వహించిన హుజురాబాద్కు ఉప ఎన్నికలు రావడం.. ఆయన మళ్లీ విజయం సాధించడం జరిగిపోయిన సంగతి తెలిసిందే.. అయితే, హుజురాబాద్ ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత.. మరోసారి ఈటల భూములపై ఫోకస్ పెట్టారు రెవెన్యూ అధికారులు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ సర్వే చేపట్టిన సంగతి విదితమే.
