CM Revanth Reddy : ఇది ఫెడరల్ స్ఫూర్తిపై దెబ్బ.. పార్లమెంట్‌లో పంచాయితీ ఖాయం

  • విదేశీ టూర్‌పై కేంద్రం నో.. రేవంత్ ఫైర్
  • ‘నా టూర్ ఆపొచ్చు.. ఆలోచనలు ఆపలేరు’
  • తెలంగాణపై కేంద్రం వివక్ష: సీఎం ఆరోపణ
  • పార్లమెంట్‌లో పంచాయితీ ఖాయం
Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy : తన విదేశీ పర్యటనకు అనుమతి నిరాకరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల స్పష్టమైన వివక్ష చూపిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తికి గొడ్డలిపెట్టులా వ్యవహరిస్తోందని, ఈ నిర్ణయాన్ని తాము ఆషామాషీగా తీసుకోబోమని, రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఖచ్చితంగా ఈ అంశాన్ని లేవనెత్తుతామని స్పష్టం చేశారు.

‘మోడీది గుజరాత్.. నాది తెలంగాణ’ అన్నదే మీ రాజకీయ అభ్యంతరమా?

నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పాలిత తెలంగాణకు మధ్య కేంద్రం కావాలనే రాజకీయ వైరం చూపిస్తోందని రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రధాని మోడీ గుజరాత్ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తుంటే, తాను తెలంగాణ ప్రతినిధిగా అభివృద్ధిని కాంక్షిస్తున్నానని, ఇదేనా కేంద్రానికి ఉన్న ప్రధాన రాజకీయ అభ్యంతరం అని ప్రశ్నించారు. విదేశీ వేదికలపై దేశం గురించి మాట్లాడితే వెంటనే వారిపై ‘దేశద్రోహి’ అని ముద్ర వేసి, దేశ అంతర్గత విషయాలను బయట మాట్లాడారంటూ తప్పుడు ప్రచారం చేయడానికి సిద్ధపడతారని మండిపడ్డారు.

పర్యటనను అడ్డుకోగలరు.. నా ఆలోచనను కాదు

కేంద్ర ప్రభుత్వం కేవలం తన పర్యటనను మాత్రమే భౌతికంగా అడ్డుకోగలదని, కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం ఉన్న తన ఆలోచనలను, ప్రణాళికలను ఆపలేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే తెలంగాణ ప్రతినిధి బృందాన్ని, అధికారులను నిర్ణీత షెడ్యూల్ ప్రకారం అమెరికాకు పంపించామని, అక్కడ కీలకమైన ఒప్పందాలు సజావుగా సాగుతున్నాయని తెలిపారు. సాధారణంగా ఏ అధికారిక విదేశీ పర్యటన జరిగినా ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయం ప్రతి సమావేశంలో పాల్గొంటుందని, ప్రొటోకాల్ ప్రకారం అన్ని సమీక్షించి నివేదికను కేంద్రానికి పంపుతుందని వివరించారు. అలాంటప్పుడు ప్రధాని దృష్టిలో లేకుండా లేదా అనుమతులు లేకుండా తాము సొంతంగా పర్యటనలు చేస్తామా అని ప్రశ్నించారు.

తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న గుజరాత్ నాయకత్వం

గుజరాత్ కేంద్రంగా పనిచేస్తున్న నాయకత్వం తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందడాన్ని ఓర్చుకోలేకపోతోందని సీఎం రేవంత్ ఆరోపించారు. రాష్ట్రంలో సంక్షేమం, పారిశ్రామికాభివృద్ధి ముందంజలో ఉంటే, కావాలనే ఆటంకాలు సృష్టిస్తున్నారని తెలిపారు. ఇది కేవలం ఒక పార్టీకి లేదా ఒక ముఖ్యమంత్రికి జరిగిన అవమానం కాదని, మొత్తం తెలంగాణ సమాజానికి జరిగిన పరాభవమని పేర్కొంటూ, కేంద్ర వైఖరిని రాష్ట్రంలోని తెలంగాణ వాదులు, ప్రజలందరూ ఏకకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు.