దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత సాధించిన చారిత్రాత్మక విజయానికి మద్దతుగా, ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులకు నివాళులు అర్పిస్తూ హైదరాబాద్లోని ట్యాంక్బండ్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఇందిరా గాంధీ విగ్రహం సాక్షిగా సాగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రచారం కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ , పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల ఉత్సాహం, వారి ముఖాల్లోని విజయదరహాసం దేశ భవిష్యత్తుకు శుభసూచకమని కొనియాడారు.
దేశ యువత విజయం.. కాంగ్రెస్ ఖాతాలో వేసుకోం
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం అనేది పూర్తిగా దేశ యువత సాధించిన విజయమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ చారిత్రాత్మక విజయాన్ని కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకోవాలని అనుకోవడం లేదని తెలిపారు. రాజకీయ పార్టీలకు అతీతంగా విద్యార్థులు సాగించిన ఐక్య పోరాటానికి అన్ని పక్షాల మద్దతు లభించిందని, అందుకే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి రాజీనామా ఆమోదించక తప్పలేదని అన్నారు. అయితే, కేవలం ఒక రాజీనామాతో సరిపెట్టకుండా ఉద్యమంలో చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు కేంద్రం తక్షణమే భారీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థులపై బనాయించిన అక్రమ కేసులను వచ్చే సోమవారం లోపు తక్షణమే ఎత్తివేయాలని కోరారు.
21 ఏళ్లకే ఎమ్మెల్యే పోటీకి అర్హత: అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం
రాబోయే రోజుల్లో దేశ భవిష్యత్తును నిర్ణయించే బాధ్యత యువతదేనని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నాడు రాజీవ్ గాంధీ 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించారని గుర్తుచేశారు. “21 ఏళ్లకే మేయర్ కావచ్చు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు కావచ్చు.. డిజిపి సి.వి. ఆనంద్ 22 ఏళ్లకే ఐపీఎస్ అయ్యారు. అలాంటప్పుడు చట్టసభల్లోకి ఎందుకు రాకూడదు?” అని ప్రశ్నించారు. వచ్చే ఆగస్టు మొదటి వారంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి, 21 ఏళ్లకే యువత ఎమ్మెల్యేగా పోటీ చేసేలా చట్ట సవరణ కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రధాని మోడీకి పంపుతామని హామీ ఇచ్చారు. 21 ఏళ్ల యువకుడు కేంద్రంలో మంత్రి అయితే దేశం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు.
ఇన్స్టిట్యూషన్లను లొంగదీసుకున్నారు.. కానీ జెన్-జీ భయపడలేదు
ఇడి (ED), సీబీఐ (CBI) వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి రాజకీయ నాయకులను లొంగదీసుకున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం, జెన్-జీ (Gen-Z) యువతపై కూడా లాఠీలు జులిపించిందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ యువత అదరక, బెదరక గుండె ధైర్యంతో ఎదురొడ్డి పోరాడి మోడీ అహంకారాన్ని ఓడించిందని అన్నారు. జంతర్ మంతర్ వద్ద మొదలైన ఈ జెన్-జీ సునామీ ఇక్కడితో ఆగకూడదని, వారి గొంతుక చట్టసభల్లో మోగాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని, ఆయన క్యాబినెట్లో విద్యాశాఖ మంత్రి బాధ్యతను జెన్-జీ ప్రతినిధికే అప్పగించేలా ఇండియా కూటమితో తాను మాట్లాడి ఒప్పిస్తానని ఇందిరమ్మ విగ్రహం ముందు సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చారు.

